కడ్తాల్ : నిత్యం ధ్యానం చేయడంతో జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవచ్చని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్మెంట్ సొసైటీస్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్లో జరుగుతున్న మహిళ ధ్యాన మహా సభలు-3 కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు పత్రీజీ వేణువుగానం, సంజయ్కింగ్ బృందం సితార, తబలా, వయోలిన్తో నిర్వహించిన ప్రాతఃకాల ధ్యానంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్ధేశించి సుభాష్పత్రీజీ మాట్లాడుతూ ఆత్మకి మరణంలేదని, నిత్యం ధ్యానం చేసి ఆత్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు.
ఆత్మజ్ఞానం తెలుసుకున్న వారందరూ ధైర్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. మనిషి సత్యంలో మునిగితే జ్ఞానమని, మనస్సు, బుద్ధి, శరీరం, శ్వాస ఏకం కావడమే ధ్యానమన్నారు. మానసిక ప్రశాంతాతకు, ఏకగ్రతకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ధ్యాన మహా సభల ఉత్సవాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ నిర్వాహకులు, నిత్యాన్నదానం చేయడంతో పాటు వసతులు ఏర్పాటు చేశారు. ధ్యాన మహాసభలకు వచ్చే ప్రతి ఒక్కరికి మాస్కులు, శానిటైజర్లు అందజేస్తున్నారు.
అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు…
మహేశ్వర మహా పిరమిడ్లో ధ్యాన మహా సభలు ఘనంగా జరుగుతున్నాయి. ధ్యాన వేడుకల్లో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం, సాయంత్రం వేళ్లలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా అలరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులను ధ్యాన గురువు సుభాశ్ పత్రీజీ శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్రెడ్డి, సభ్యులు సాంబశివరావు, బాలకృష్ణ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.