కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన శంభీపూర్ రాజు కుత్భులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కలిసి, బుధవారం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సంప్రదాయం ప్రకారం వారికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి నిర్వాహకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం వేల కోట్లను వెచ్చిస్తున్నదని తెలిపారు.
సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించిన్నట్లు వారు వివరించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగరాజుయాదవ్, సింగిల్విండో చైర్మన్ బాల్రెడ్డి, కార్పొరేటర్లు రాగం పాండుముదిరాజ్, జగన్, సత్యనారాయణ, గోవింద్రెడ్డి, భాస్కర్యాదవ్, శేషగిరి, శ్రీనివాస్రెడ్డి, కొండారెడ్డి, విజయరాంరెడ్డి, సాయికిరణ్, ఆలయ అర్చకుడు యాదగిరిస్వామి, చంద్రయ్య, దేవేందర్, రాములు పాల్గొన్నారు.