తుర్కయంజాల్, ఏప్రిల్ 15: మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోకుండా విడాకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సాయి పంచవటి హోమ్స్ కాలనీలోని ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ ఇంటి ముందు ఆయన భార్య జ్యోతి ఆందోళన చేపట్టింది. మెదక్ ఏఆర్ డీఎస్పీ తుర్కయంజాల్ సాయి పంచవటి హోమ్స్లోని తన సొంత ఇంటిలో కొద్ది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో రంగనాయక్ దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఆయన భార్య జ్యోతి గత సంవత్సరం నవంబర్లో మిర్యాలగూడ సమీపంలోని తన తల్లి ఇంటికి వెళ్లి రంగనాయక్పై నల్గొండ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రంగనాయక్ భార్య జ్యోతి తన కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయక్ ఇంటికి చేరుకుంది. ఆమెను పైకి రాకుండా మెట్ల వద్ద ఉన్న గేటుకు తాళం వేయడంతో జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయక్ ఇంటి ముందు ఆందోళనకు దిగి 100 నంబర్కు డయల్ చేయడంతో ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
పోలీసుల ప్రమేయంతో రంగనాయక్ ఇంటి గేటు తాళాన్ని తీసి తన భార్యను ఇంటిలోనికి రానిచ్చాడు. ఈ సందర్భంగా రంగ నాయక్ భార్య జ్యోతి మాట్లాడుతూ తన భర్త ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనకు విడాకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడని తనకు విడాకులు వద్దని తన భర్త,పిల్లలు మాత్రమే తనకు కావాలని కోరింది.తన భర్తతో ఉన్న మహిళను ఇంటి నుంచి పంపించి తనకు న్యాయం చేయాలని ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేలా అధికారులు సహకరించాలని ఆమె కోరింది.