జనగామ రూరల్ : క్రమశిక్షణతో శిక్షణ పొంది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనున్న ఉద్యోగాల నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని పెంబర్తి గ్రామం వీబీఐటీ క్యాంపస్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వరంగల్ పోలీస్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత పోలీస్ శిక్షణ సెంటర్ను ఆదివారం సందర్శించి శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రద్ధగా కొచింగ్ తీసుకొని విద్యార్థులు తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని అన్నారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని శిక్షణ తీసుకోవాలన్నారు.
ఈ అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జనగామ ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ కర్ణాకర్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, గౌరవ అధ్యక్షుడు పజ్జూరి గోపయ్య, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి, సీనియర్ నాయకులు బాల్డె సిద్ధిలింగం, సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ రవి పాల్గొన్నారు.