ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 30 : హెల్మెట్ భారం కాదు.. భరోసా అనే శీర్షికతో ఈనెల 23న నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి ఇబ్రహీంపట్నం పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. హెల్మెట్ ధరించకుండా రోడ్లపై ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసే ప్రయాణికులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ గురునాయుడు, లా అండ్ ఆర్డర్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా ఎక్కడికక్కడ సుమారు 20 నుంచి 30 మంది హెల్మెట్ ధరించని వారిని పట్టుకుని వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తే జరిగే పరిణామాలు, పోలీసుశాఖ ఆధ్వర్యంలో తీసుకునే చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, యాచారం, తుర్కయంజాల్, ఆదిబట్ల, యాచారం పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు పెద్ద ఎత్తున ఉన్నందున విద్యార్థులు ఇష్టానుసారంగా ప్రయాణాలు కొనసాగిస్తూ గాయాలపాలవుతున్నందున దీనిపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా రోడ్లపైకి వచ్చే ద్విచక్ర వాహనదారులపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ గురునాయుడు తెలిపారు.