సిటీబ్యూరో, జూలై15 (నమస్తే తెలంగాణ): పేరు గొప్ప..ఊరు దిబ్బ.. అన్నట్లుగా ఉన్నది ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి. నగరంలోని పెద్ద దవాఖానలకు ఇన్సులిన్ కొరత వెంటాడు తున్నది. సర్కార్ దవాఖానల్లో ఇన్సులిన్ లేదంటూ నో స్టాక్ బోర్డులు పెట్టడంతో మధుమేహ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ లేక ఆర్థికభారం అయినప్పటికీ ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మధుమేహ బాధితులు రోజురోజుకూ పెరుగుతు న్నారు.
వారిలో ఇన్సులిన్ తీసుకుంటే తప్ప రోజు గడవని వారు అనేక మంది ఉన్నారు. మధుమేహం అదుపులో పెట్టుకునేందుకు మందుల దశ నుంచి ఇన్సులిన్ దశకు చేరినవారు అనేకమంది ఉన్నారు. అలాంటి వారంతా నగరంలోని ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో ఉచితంగా ఇచ్చే ఇన్సులిన్ కోసం ప్రతిరోజూ క్యూలు కడుతుంటారు.
నోస్టాక్ బోర్డుల దర్శనం
ప్రభుత్వ దవాఖానలైన గాంధీ, ఉస్మానియాకు ప్రతిరోజూ సుమారుగా 300 మంది మధుమేహ బాధితులు ఇన్సులిన్ కోసం వస్తుంటారు. కాగా, గత కొన్ని రోజులుగా గాంధీ, ఉస్మానియాల్లో ఇన్సులిన్ స్టాక్ లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ఆస్పత్రుల కౌంటర్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బాధితులు చేసేదేమీ లేక ప్రైవేట్ మెడికల్ షాపుల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఇన్సులిన్ కొంటున్నారు. కేవలం ఇన్సులిన్ మాత్రమే కాకుండా అరుదైన శస్త్రచికిత్సలు చేసేటప్పుడు వినియోగించాల్సిన మందులు కూడా ప్రభుత్వాస్పత్రుల్లోని ఫార్మసీల్లో అందుబాటులో ఉండడం లేదనే విమర్శలున్నాయి.
గత బీఆర్ఎస్ పాలనలోప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మొదలు
పెద్ద దవాఖానల వరకూ మందుల కొరత లేకుండా అప్పటి ఆరోగ్యశా ఖ మంత్రులు చర్యలు చేపట్టారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించడంలో అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే పేదలకు ఉచిత, నాణ్యమైన వైద్యమందిస్తున్నామని గొప్పలు చెప్పే కాంగ్రెస్ సర్కార్ మందుల కొరతను అధిగమించడంలో ఎలాంటి చర్య లు తీసుకోకపోవడంపై విమర్శలున్నాయి.