బొంరాస్పేట, ఆగస్టు 30:బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్లిన వికారాబాద్ జిల్లావాసులు.. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా కాలం గడుపుతున్నారు. నాడు సాగునీరు లేక.. పని దొరుకక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ‘మిషన్ కాకతీయ’తో చెరువులు, కుంటలను పునరుద్ధరించడంతో పాటు చెక్డ్యాంలు, ప్రాజెక్టుల నిర్మాణంతో కురిసిన వర్షాలకు నీటి నిల్వలు పెరిగాయి. భూగర్భ జలాలు పెరుగడం వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో కూలీల కొరత ఏర్పడింది. సిరిసిల్ల, మహబూబ్నగర్, వికారాబాద్ తదితర జిల్లాలకు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వలస వచ్చి నాలుగు నెలల పాటు ఉండి వరినాట్లు వేసి ఉపాధి పొందుతున్నారు. ఇందులో భాగంగా బొంరాస్పేట మండలానికి ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన కూలీలు వచ్చి వరినాట్లు వేస్తున్నారు. రానున్న రోజుల్లో వలస కూలీల రాక మరింత పెరిగే అవకాశం ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బొంరాస్పేట, ఆగస్టు 30 : ఉమ్మడి పాలమూరు జిల్లా వలసలకు పెట్టింది పేరు. గ్రామాల్లో ఉపాధి లేక కూలీలు పొట్ట చేతపట్టుకుని విదేశాలకు, ముంబయి, పుణే వంటి నగరాలకు వలసలు వెళ్లేవారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలోని పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు తగ్గాయి. వలస జిల్లాకే ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వచ్చి బతుకుతున్నారు. ఇది స్వరాష్ట్రంలో మన పాలకులు సాధించిన ఘనత. తెలంగాణ ఏర్పడిన తరువాత అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో పాటు వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. మిషన్ కాకతీయ పథకం వల్ల చెరువులను అభివృద్ధి చేయడంతో చెరువుల్లో నీటిమట్టం పెరగడంతో పాటు బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రతి ఏటా సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో కూడాచెరువులు, కుంటలు నిండి వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. తక్కువ మంది కూలీలతో ఎక్కువ పని మండలంలోని చౌదర్పల్లి, చిల్ముల్మైలారం గ్రామాల్లో వరినాట్లు వేయడానికి ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన 16 మంది కూలీలు వచ్చారు.
గత నెల రోజుల నుంచి రెండు గ్రామాల్లోని వరి పొలాల్లో వీరు నాట్లు వేస్తున్నారు. గ్రామాల్లోని స్థానిక కూలీలు 20 మంది కలిసి రోజూ 3 ఎకరాల్లో వరినాట్లు వేస్తే యూపీకి చెందిన 16 మంది కూలీలు రోజూ 7 ఎకరాల్లో వరినాట్లు వేస్తున్నారు. కూలీల్లో ఎక్కువ మంది మగవారే కావడం గమనార్హం. స్థానిక కూలీలు ఎకరాకు రూ.6 వేల నుంచి 7 వేలు కూలి తీసుకుంటే.. యూపీ కూలీలు రూ.4600 తీసుకుంటున్నారు. తమ రాష్ట్రంలో రెండు నెలల ముందే వరినాట్లు పూర్తయ్యాయని, అక్కడ పని లేకపోవడంతో ఇక్కడికి వచ్చామని యూపీకి చెందిన కూలీలు సురేశ్, సుజీత్ తెలిపారు. తెలంగాణలోని సిరిసిల్ల, మహబూబ్నగర్, వికారాబాద్ తదితర జిల్లాల్లో తాము ఏటా నాలుగు నెలల పాటు ఉండి వరినాట్లు వేసి వెళ్తామని తెలిపారు.
యూపీ కూలీలు వేసే వరినాట్లు కూడా స్థానిక కూలీలు వేసే దానికంటే వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా వేస్తారని, ఈ విధంగా నాటు వేయడం వల్ల పంట దిగుబడి కూడా పెరుగుతుందని చౌదర్పల్లి గ్రామానికి చెందిన రైతులు రాంచంద్రారెడ్డి, తుల్జారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి తెలిపారు. నారు తీయడం, పొలంలో నారు సరఫరా చేయడం కూడా యూపీ కూలీలే చేసుకుంటారని రైతులు తెలిపారు. యూపీ కూలీల వల్ల తక్కువ సమయం, తక్కువ కూలీతో ఎక్కువ విస్తీర్ణంలో నాటు వేయవచ్చని రైతులు తెలిపారు. ఉదయం 6 నుంచి 7 గంటల కల్లా పొలానికి వస్తారని, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా నాట్లు వేస్తారని రైతులు తెలిపారు. యూపీ కూలీల పని విధానం చూసి మండల రైతులు వారి వైపే మొగ్గు చూపుతున్నారు. మండలంలో వ్యవసాయ పనులకు రానున్న రోజుల్లో ఇతర రాష్ర్టాల కూలీల రాక మరింత పెరిగే అవకాశముందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఏటా తెలంగాణలోని సిరిసిల్ల, మహబూబ్నగర్ జిల్లాలకు వచ్చి వరినాట్లు వేస్తాం. ఏడాదిలో నాలుగు నెలలు ఇక్కడే ఉంటాం. యాసంగి, వానకాలం వరి నాట్లు వేసి వెళ్తాం. ఎకరాకు రూ.4500 వరకు తీసుకుంటాం. రోజూ ఏడు ఎకరాల్లో నాటు వేస్తాం : సుజీత్, యూపీ నారు అందుబాటులో ఉంటే 16 మంది కూలీలం కలిసి ప్రతి రోజూ 7 ఎకరాల్లో వరినాట్లు వేస్తాం. యూపీలో రెండు నెలల ముందే వరినాట్లు పూర్తయ్యాయి. అందుకే అక్కడ పని లేక తెలంగాణకు వచ్చాం. మరో 15 రోజులుండి నాట్లు పూర్తయిన తరువాత యూపీకి వెళ్తాం.