తుర్కయాంజాల్, ఏప్రిల్ 10: రోడ్లపై పాదచారులు ప్రమాదాలకు గురి కాకుండా రద్దీగా ఉండే చౌరస్తాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతారు. తుర్కయాంజాల్ మున్సిపల్ చౌరస్తాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేండ్ల నుంచి తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో వాహనాల రద్దీ పెరిగింది. దీంతో పాదచారులు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురి కావడంతో పాటు పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి.
తుర్కయాంజాల్ చౌరస్తాలో ఉన్న సాగర్ ప్రధాన రహదారిని నిత్యం వందల సంఖ్యలో ప్రజలు దాటుతారు. సాగర్ ప్రధాన రహదారికి ఇరువైపులా దవాఖానలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. దీంతో పాదచారులు రోడ్డును దాటి మరోవైపుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వేగంగా దూసుకొస్తున్న వాహనాలతో పాదాచారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
గతంలో తుర్కయాంజాల్ చౌరస్తాలో రోడ్డును దాటడానికి యూటర్న్ ఉండగా చౌరస్తాలో వాహనాలు మలుపు తీసుకునేప్పుడు ప్రమాదాలు జరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు యూటర్న్ను మూసివేసి దిమ్మెలను ఏర్పాటు చేశారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి కార్యాలయం, దుకాణాలకు వెళ్లే పాదచారులు దిమ్మెలపై నుంచి రోడ్లను దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ఫుల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
తుర్కయాంజాల్ చౌరస్తాలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పాదచారులు రోడ్డు దాటే క్రమంలో వేగంగా వస్తున్న వాహనాలతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తుర్కయాంజాల్ చౌరస్తాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.
– మేతరి శంకర్, తుర్కయాంజాల్