పరిగి, సెప్టెంబర్ 1: పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా నార్మాక్ సంస్థ పాల సేకరణ ధరను పెంచింది. సర్కారు సూచనతో పాల సేకరణ ధరను మరోసారి పెంచడం ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి నల్గొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ (నార్మాక్) అండగా నిలుస్తున్నది. పాలలో వెన్న శాతం ఆధారంగా గేదె పాలకు లీటర్కు రూ.3.96 నుంచి రూ.6.60 వరకు ధర పెంచడం జరిగింది. ఆవు పాలకు రూ.5 నుంచి 5.59 వరకు పెరిగింది. ఈ ఏడాదిలో రెండుసార్లు పాల సేకరణ ధరను నార్మాక్ సంస్థ పెంచడం ద్వారా వికారాబాద్ జిల్లాలోని సుమారు 2వేల మంది పాడి రైతులకు ప్రయోజనం కలుగనున్నది. పెరిగిన ధరలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలోని పరిగి, తాండూరుల్లో పాలశీతలీకరణ కేంద్రాలున్నా యి. పరిగి పాలశీతలీకరణ కేంద్రంలో ప్రతిరోజూ సుమారు 2,300 లీటర్లకు పైగా, తాండూరులో 650 లీటర్లకు పైగా పాలను సేకరించి నార్మాక్కు పంపించడం జరుగుతున్నది.
ఏడాదిలో రెండు సార్లు ధర పెంపు
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడం ద్వారా నార్మాక్ సంస్థ ఈ ఏడాదిలో రెండు సార్లు పాల సేకరణ ధరను పెంచింది. గత ఫిబ్రవరి నెలలో ఒకసారి పాల సేకరణ ధరను రూ.2 మొదలుకొని రూ.6 వరకు గేదె పాలపై ధరను పెంచగా.. ఆవు పాలకు సంబంధించి మూడు శాతం వెన్న ఉంటే లీటరు పా లకు రూ.28.11 నుంచి రూ.2.60 పెంచి రూ. 30.71 చెల్లిస్తున్నది. వెన్నశాతం 4.5పైగా ఉంటే లీటరు పాలకు అదనంగా రూ.3.20 కలిపి మొత్తం రూ.34.71 వరకు ఇస్తున్నది. కాగా ప్రభుత్వ సూచనల మేరకు నార్మాక్ పాల సేకరణ ధరను పెంచు తూ నిర్ణయం తీసుకోవడంతో పాడి రైతులకు మేలు జరుగనున్నది.
పాలతోపాటు వెన్న రేట్లు పెంపు..
ప్రస్తుతం గేదె పాలు ఆరు శాతం పైన వెన్న ఉంటే లీటరుకు రూ.34.20 చెల్లిస్తున్నారు. దాన్ని ఇప్పు డు రూ.39.20కి పెంచారు. పది శాతం పైన ఫ్యాట్ ఉంటే రూ.74.40 నుంచి 79.99కి పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకున్నది. మూడు శాతం పైన ఫ్యాట్ ఉన్న ఆవు పాలకు లీటరుకు రూ.30.71 నుంచి రూ.35.70కి పెంచారు. ఐదు శాతం పైన ఫ్యాట్ ఉంటే రూ.34.71 నుంచి రూ.40.30కి పెంచారు. గేదె పాల నుంచి తీసే వెన్న ధర కిలో రూ.690 నుంచి రూ.756 పెంచగా.. ఆవు వెన్నకు కిలోకు రూ.270 నుంచి రూ. 313 పెరిగింది.
రూ.4 ప్రోత్సాహకం అదనం..
పాల ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకంగా అందిస్తున్నది. నార్మాక్ సంస్థ పెంచిన పాల సేకరణ ధరకు అదనంగా ప్రభుత్వం ఈ ప్రోత్సాహాన్ని అందించనున్నది. ఈ సంస్థ పరిధిలోని పాడి రైతులకు మాత్రమే ఇది వర్తించనున్నది. ఇప్పటివరకు ప్రభుత్వం నార్మాక్ ద్వారా నేరుగా రైతులకు ప్రోత్సాహాకాన్ని అందిస్తూ వస్తున్నది. గేదె పాలలో కనీసం వెన్నశాతం 5.0 కంటే అధికంగా ఉండటంతోపాటు ఎస్ఎన్ఎఫ్ 8.5శాతం, ఆవు పాలలో వెన్నశాతం 3.0 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.0శాతం నుంచి అధికంగా ఉంటేనే ఈ ప్రోత్సాహం వర్తిస్తుంది.
ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించింది
రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ఆవు, గేదె పాల ధరను పెంచి భరోసా కల్పించింది. ప్రస్తుతం గేదె పాలలో ఆరు శాతం పైన ఉన్న ఫ్యాట్కు లీటరుకు రూ.34.20 చెల్లిస్తుండగా.. తాజాగా రూ.39.20కి పెరుగనున్నది. అదేవిధంగా ఆవు పాలలో మూ డు శాతం పైన ఫ్యాట్ ఉంటే లీటరుకు రూ.30.71 ఉండగా.. రూ.35.71గా నార్మాక్ సంస్థ నిర్ణయించడం ద్వారా రైతులకు మేలు జరుగనున్నది.
-గోపాల్గారి శ్రీనివాస్యాదవ్, నార్మాక్ డెయిరీ చైర్మన్, దోమ
పాడి రైతులకు మేలు జరుగుతుంది
పాల ధరను పెంచడంతో పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. తద్వారా వారు పాడి పశువులను పెంచి పాల ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వం పాడి రైతులకు అండగా ఉండటం శుభపరిణామం.
-జాకారం నారాయణ, పాడి రైతు, దోమ