చిక్కడపల్లి, డిసెంబర్ 15: థిన్నర్ డబ్బా పేలిన ఘటనలో తండ్రీకొడుకులు గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు లోయల్ ట్యాంక్బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్లో సంభవించింది. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో జరిగిన ఈ పేలుడితో భారీ శబ్దం వచ్చింది. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ఇన్స్పెక్టర్ మోహన్ రావు, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా నాంచర్ల గ్రామానికి చెందిన చంద్రన్న పదేండ్ల కిందట హైదరాబాద్కు వచ్చాడు.
జీవనాధారం కోసం చిత్తు కాగితాలు సేకరిస్తూ, విక్రయించగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. గురువారం కూడా తన కుమారుడు సురేశ్తో కలిసి డంపింగ్ యార్డ్కు వచ్చాడు. చెత్తను సేకరిస్తున్న సమయంలో థిన్నర్ డబ్బా కనిపించింది. ఆ డబ్బాను ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చంద్రన్న ఎడమ చెయ్యి పూర్తిగా దెబ్బతిన్నది. పక్కనే ఉన్న సురేశ్ ముఖానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
భారీ శబ్దంతో భయం..
ఈ పేలుడు ఘటనతో భారీ శబ్దం వచ్చింది. స్థానికులు, బాటసారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్ బృందాలు ఘటనా స్థలానికి వచ్చి వివరాలను సేకరించారు. డాగ్ స్కాడ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న నేతృత్వంలో అక్కడికి వచ్చిన సిబ్బంది ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. సంఘటన స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర, అడిషనల్ డీసీపీ ఎ.రమణా రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బండారు శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం
సమాచారం అందుకున్న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు. వెంటనే గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనలో గాయపడి, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి, కొడుకుకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామని చెప్పారు.
– శ్రీలతా శోభన్ రెడ్డి, డిప్యూటీ మేయర్