‘తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది.. పల్లెల్లో అక్షరాస్యత రేటు పెరిగింది.. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు కృషి చేయాలి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మోమిన్పేట మండలంలోని చంద్రాయన్పల్లి కేజీబీవీలో రూ.2.5 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. 10,12వ తరగతుల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. గతంలో ఆడ బిడ్డలను పాఠశాలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడేవారని, తెలంగాణ ప్రభుత్వం బాలికలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. పాఠశాలల నిర్మాణానికి, మరమ్మతులకు సీఎం కేసీఆర్ అధికంగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. అనంతరం మోమిన్పేట మండల కేంద్రంలోని బీకేఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు.
మోమిన్పేట, జనవరి 10 : రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధి చంద్రయాన్పల్లిలోని కేజీబీవీ పాఠశాలలో రూ.2.5 కోట్లతో నూతనంగా నిర్మించిన కళాశాల భవనాన్ని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో విద్యాభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యతో అక్షరాస్యత పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అర్హత సాధించిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య లభిస్తున్నదని పేర్కొన్నారు. నేడు బాలికలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రులు హర్షం చేస్తున్నారని తెలిపారు. కేజీబీవీ పాత భవనం మరమ్మతులకు కృషి చేస్తామని చెప్పారు.
ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి 10, 12 తరగతుల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు. మారుమూల గ్రామల్లో బాలికలు చదువుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. కేజీబీవీ పాఠశాలల్లో ప్రాథమిక విద్యతోపాటు ఇంటర్మీడియట్ విద్యను కూడా అందిస్తూ ఆడబిడ్డలకు బంగారు భవిష్యత్తును కల్పిస్తున్నదని పేర్కొన్నారు.
జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఇంట్లో ఆడబిడ్డ చదువు ఇంటికి వెలుగునిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఆడబిడ్డ చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకొని భావితరాలకు ఆదర్శంగా నిలువాలని సూచించారు. కేసీఆర్ ఆడబిడ్డల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారన్నారు.
తెలంగాణ సాధించుకొని కేసీఆర్ పాలన చేపట్టాకే రాష్ట్రంతోపాటు విద్యాభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. చదువుతోపాటు ఆటల్లో కూడా బాలికలు ముందుండాలన్నారు. బాగా చదువుకొని తమ కుటుంబానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఈవో రేణుకాదేవి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకట్, ఎంపీపీ వసంత, వైస్ ఎంపీపీ మానస, ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు హరిశంకర్, శనైశ్వర ఆలయ చైర్మన్ మహిపాల్రెడ్డి, సర్పంచ్ అంజయ్య, మండల అధికారులు, నాయకులు, కేజీబీవీ సిబ్బంది ఉన్నారు.
శంకర్పల్లి : మండలంలోని ఎల్వర్తి గ్రామానికి చెందిన సొసైటీ మాజీ చైర్మన్ లింగారెడ్డి తల్లి లక్ష్మమ్మ చనిపోవడంతో మంత్రి సబితారెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులుపాల్గొన్నారు.
వికారాబాద్ : జిల్లాల కోసం చర్చించినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటగా వికారాబాద్ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడుతారని మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం మోమిన్పేట మండలం బీకేఆర్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పార్టీ బలోపేతానికి గ్రామాల్లో సమన్వయ కమిటీలు వేసి ప్రతి 100 మందికి ఒక ఇన్చార్జిని నియమించి ప్రభుత్వం చేసే అభివృద్ధిని పూర్తిస్థాయిలో తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి జరుగడంతో, ఇతర రాష్ర్టాలవారు కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి మహిళలు, యువతను భాగస్వాములను చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలే బాధ్యతగా తీసుకొని పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే ఆనంద్ ‘మీతో నేను’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లడం.. సమస్యలు తెలుసుకోవడం చాలా బాగుందని అభినందించారు.
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పథకాలతో కూడిన కంటెంట్ పాన్ ఇండియా స్టార్ లాంటి కటౌట్ ఉన్న కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ రేపు దేశవ్యాప్తంగా పక్కాగా హిట్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరు చేశామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసిమెలిసి కుటుంబ సభ్యులు మెలగాలని సూచించారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని తెలిపారు.
ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాలవారీగా కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. జనాభాకు అనుగుణంగా ఇన్చార్జీలను నియమించాలని పేర్కొన్నారు. అభివృద్ధిపై ప్రజలకు తెలియజేస్తూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల నోర్లు మూయించాలని పిలుపునిచ్చారు. నాయకుల సలహాలు, సూచనలు తెలుసుకునేందుకే ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను పార్టీ నాయకులు సన్మానించారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఆనంద్ గ్రామాలవారీగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.