సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం కింద రెండో దశ పనులు చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదన అటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటినా కొత్త ప్రాజెక్టుల ఊసే ఎత్తడంలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి సీఆర్ఎంపీ రెండో దశలో రూ.696.71 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని జీహెచ్ఎంసీ కోరినప్పటికీ సర్కారు నుంచి ఎలాంటి పరిపాలన అనుమతులు లభించలేదు. దీంతో ఇంజినీరింగ్ విభాగం అధికారులు, కమిషనర్ సైతం సీఆర్ఎంపీ రెండో దశపై సమీక్ష జరపడంలేదు.
ఫలితంగా ఇప్పట్లో రెండో దశ పనులు ప్రారంభం కావడం కష్టసాధ్యంగానే మారింది. కాగా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా వాహనదారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ పధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి తొలి విడుతగా 811.958 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ ఏజెన్సీలకు 2020 సంవత్సరంలో అప్పగించారు. దాదాపు రూ.1050 కోట్ల మేర ఖర్చు చేసి నిర్ణీత లక్ష్యాన్ని గతేడాది అక్టోబర్లోనే చేరుకున్నారు.
ఈ సీఅర్ఎంపీ విధానం ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే సీఆర్ఎంపీ మోడల్ వివరాలను తీసుకోగా.. ఛత్తీస్గఢ్ , రాజస్థాన్కు చెందిన పలు కార్పొరేషన్లు పురపాలక శాఖను సంప్రదించారు. ఇటువంటి పథకాన్ని కొత్త ప్రభుత్వం చేపట్టేందుకు ముందుకు రాకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.