ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని రాయపోల్ శ్మశాన వాటిక నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రెండు రోజులుగా అక్రమంగా ఓ వ్యాపారి మట్టి తరలిస్తున్నారు. శ్మశాన వాటికలో రెండు జేసీబీలు, 20 ట్రాక్టర్లతో వ్యాపారి అక్రమంగా మట్టిని తవ్విస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ పాలకవర్గం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై తాసీల్దార్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా అక్రమంగా శ్మశాన వాటిక నుంచి మట్టి తరలిస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని, ప్రభుత్వ స్థలంలో మట్టిని తీసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.