పెద్దఅంబర్పేట, మే 21 : మండే ఎండలతో చెక్డ్యాంలు, చెరువులు, కుంటల వద్ద నీళ్లు కనిపిస్తే చాలు చల్లగా సేదతీరాలనిపిస్తుంది. నీళ్లలో దుంకి ఈత కొట్టాలనిపిస్తుంది. స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది.. ఈత కొట్టాలన్న ఉత్సాహం మంచిదే అయినా, అదే సమయంలో చేస్తున్న అతి ప్రాణాలమీదకు తెస్తున్నది. గత వారం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని సంఘి చెరువు వద్ద సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఓ బాలుడు నీట మునగగా, కాపాడే ప్రయత్నంలో మరో యువకుడు మృతిచెందాడు. గత ఏడాది గండిచెర్వులోని చెరువు వద్ద స్నేహితులు ఈత కొట్టేందుకు వెళ్లారు. ఫొటోలు తీసుకునే అత్యుత్సాహంలో ఈత రాక నీటమునిగి ఇద్దరు మృతిచెందారు. మరోవైపు పెద్దఅంబర్పేటలోని చెక్డ్యాం వద్ద ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతిచెందాడు. ఈత రాకపోయినా ఏం కాదులే, చెరువులో నీళ్లు తక్కువే కనిపిస్తున్నాయి ఏమవుతుందిలే అని అపోహతో నీళ్లలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా, చెరువులు, కుంటల వద్ద ప్రమాదకరంగా ఫొటోలు దిగడం, సెల్ఫీలకు ఫోజులివ్వడం, నీళ్లలోకి తోసుకోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు, అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని చెరువులు, లోతైన కుంటల వద్ద ప్రమాదాల నేపథ్యంలో అబ్దుల్లాపూర్మెట్టు పోలీసులు అప్రమత్తమయ్యారు. చెరువులు, కుంటలు, చెక్డ్యాంల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేసి ఈతరాని వారు బావుల్లోకి దిగొద్దని సూచనలు చేస్తున్నారు.
వేసవి సెలవుల్లో ఈత కొట్టాలని పిల్లలు ఉత్సాహం చూపడం సహజమే. కానీ, తల్లిదండ్రులు తప్పనిసరిగా వారిని పర్యవేక్షించాలి. దగ్గరుండి పిల్లలకు ఈత నేర్పించాలి. మండలంలో ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలను గుర్తిస్తున్నాం. ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే గండిచెర్వు, సంఘి గ్రామాల్లోని చెరువుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాం. ప్రమాదాల గురించి ముందే హెచ్చరిస్తున్నాం. సెలవు రోజుల్లో పెట్రోలింగ్ సిబ్బంది సైతం ఆయా చెరువుల వద్దకు వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం. యువత జాగ్రత్తగా ఉండాలి. చెరువులు, కుంటల వద్ద ఫొటోలు, సెల్ఫీల, ఆటల పేరుతో ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దు. ఈ విషయంలో పోలీసులకు సహకరించాలి.
– ఏ మన్మోహన్, ఇన్స్పెక్టర్, అబ్దుల్లాపూర్మెట్టు