వెస్ట్ మారేడుపల్లి చెందిన శేఖర్ బంజారాహిల్స్ రావడానికి క్యాబ్ బుకింగ్ చేసుకున్నాడు. రైడ్ ధర రూ. 190 చూపించింది. 10నిమిషాలు గడిచినా డ్రైవర్ రాకపోవడంతో అతడికి ఫోన్ చేయగా.. ఎంత ధర చూపిందని అడిగి 250 ఇస్తే లొకేషన్కు వస్తానని..లేకపోతే రద్దు చేసుకోవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అంతేకాదు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. క్యాష్ ఉంటేనే రైడ్ అంటూ చెబుతున్నారు. సదరు సంస్థల మనీ పాకెట్ నుంచి కూడా డబ్బులు చెల్లించే వెసులు బాటు ఉన్నప్పటికి డ్రైవర్లు కుదరదని మొండికేస్తున్నారు. దీంతో చేతిలో క్యాష్లేని వారు ఏటియంలలో డ్రా చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సిటీబ్యూరో, మార్చి 14 ( నమస్తే తెలంగాణ ) : “రైడ్ బుక్ చేసుకున్నాక పికప్ చేసుకోవడానికి వచ్చిన డ్రైవర్ అమౌంట్ ఎంత చూపించింది సర్ అని వినయంగా అడుగుతాడు. బంజారాహిల్స్ నుంచి సికింద్రాబాద్కు 130 చూపించింది అని చెబుతాం. ఓకే సార్ మీరు కొంచం రైడ్ రద్దు చేస్తారా? ఎందుకంటే అందులో 40 రూపాయలకు పైగా కంపెనీ కట్ చేస్తుందని చెబుతాడు. ఓకే అని మనం అమాయకంగా ఆ రైడ్ను రద్దు చేశామా? ఇక అంతే సంగతులు. డెస్టినేషన్ చేరాక.. రైడ్ ధర ఏకంగా 180 అవుతుంది. ఇదేంటని అడిగితే అంతే చూపించింది. మీరు అంత ఇవ్వాల్సిందే. మీరు రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? స్క్రీన్ షాట్ తీసుకోవాల్సింది? అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఘర్షణకు దిగుతున్నారు? చేసేదేమిలేక వారు అడిగినంత చెల్లించాను.” ఇది సికింద్రాబాద్కు చెందిన కరణ్కు ఎదురైన స్వీయ అనుభవం.
బీమా ఇలా తెలుసుకోండి..
ఓలా, ఉబెర్, రాపిడోలు ప్రస్తుతం నగరంలో లక్షల మందిని డెస్టినేషనల్కు చేరుస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రయాణికుడి బీమా వివరాలు సదరు యాప్లో ఉంటాయి. అందులో మన వివరాలు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక మనం నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై ఫిర్యాదు చేయాలనుకుంటే మెయిన్ మెనూలో సపోర్ట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో రైడ్కు సంబంధించిన వివరాలు ఉంటాయి. మీ ఇష్యూ ఏమైనా ఉందా అని అడుగుతుంది. దానిని క్లిక్ చేయాలి. అందులో డ్రైవర్కు సంబంధించిన దానిని క్లిక్ చేస్తే సరిపోతుంది. అందులో డ్రైవర్పై ఫిర్యాదు చేయొచ్చు.
బీమా వర్తించదు..
నగరంలో సౌకర్యవంతంగా గమ్యస్థానానికి చేరుకోవాడానికి క్యాబ్లు, బైక్లు బుక్ చేసుకోవడం నేటి రోజుల్లో సాధారణమైపోయింది. అయితే ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన యాప్ ఆధారిత వాహన సేవా సంస్థల డ్రైవర్లు ప్రయాణికులతో గొడవకు దిగుతున్నారు. రైడ్ క్యాన్సిల్ చేసుకొమ్మని ఒత్తిడి చేస్తున్నారు. రైడ్ రద్దు చేస్తే ప్రయాణికుడికే ఎక్కువ నష్టమని అప్రమత్తంగా ఉండాలని
నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా యాప్ ఆధారిత వాహన కంపెనీలు ప్రయాణికులను చేర్చే క్రమంలో ఏదైనా ప్రమాదంలో మరణం సంభవిస్తే సదరు వ్యక్తికి రూ.5లక్షల వరకు ప్రమాద బీమా చెల్లించాల్సి ఉంటుంది. తీవ్ర గాయాలైతే ట్రీట్మెంట్కు లక్ష వరకు చెల్లిస్తుంది. ఇవన్నీ సదరు ప్రయాణికుడికి అందుతాయి. కానీ వీటిపై చాలా మందికి అవగాహన ఉండటం లేదు. ఈ బీమా ఫలితాలన్నీ రైడ్ చేస్తున్న సమయంలోనే వర్తిస్తాయి. అంటే మనం రైడ్ బుక్ చేసుకున్నాక పికప్ లొకేషన్ నుంచి ఎండ్ లొకేషన్ చేరే వరకు వర్తిస్తుంది. మార్గమధ్యలో ప్రమాదం జరిగితే కంపెనీ పాలసీ ప్రకారం బీమా వర్తిస్తుంది. కానీ కొంతమంది డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తుండటంతో రైడ్ రద్దు చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పిదమని నిపుణులు చెబుతున్నారు.
రైడ్ రద్దు చేయమని ఒత్తిడి చేస్తున్నారు
యాప్ ఆధారిత డ్రైవర్లు రైడ్ ఓకే అయ్యాక రద్దు చేసుకోవాలని చెబుతున్నారు. వారికి కంపెనీ డబ్బులు ఇవ్వడం లేదని అంటున్నారు. మన రైడ్ క్యాన్సిల్ చేసుకుంటే డెస్టినేషన్కు వెళ్లాక డబ్బులు అధికంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది వారి అతి తెలివికి నిదర్శనం. లేదా ముందే అమౌంట్ ఎంత చూపిస్తుందని అడిగి వారికి నచ్చకపోతే రావడానికి ఆలస్యం చేస్తున్నారు. ఇక మనమే ఆ రైడ్ రద్దు చేసుకునేలా పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రయాణికులు యాప్ ఆధారిత సేవలు నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకోవాలి.
–ప్రవళిక, ఉద్యోగి
డబ్బులు రెట్టింపు వసూలు చేస్తున్నారు
నేను హైటెక్ సిటీ మెట్రో నుంచి ఐకియా వరకు క్యాబ్ బుక్ చేసుకున్నాను. ధర రూ.110 చూపించింది. 15 నిమిషాలు గడిచినా డ్రైవర్ రాకపోవడంతో నేను ఫోన్ చేశాను. అతడు డబ్బులు ఎంత చూపించింది అని అడిగాడు. నేను చెప్పాను. దాంతో అది మాకు సరిపోవడం లేదని 200 ఇస్తే క్యాబ్ వస్తుందని చెప్పాడు. అదేంటని అడిగితే మీ ఇష్టం రద్దు చేసుకోవచ్చు అంటూ రూడ్గా మాట్లాడాడు. నేను ఆ రైడ్ రద్దు చేసి మరలా ప్రయత్నిస్తే అరగంట అయినా రైడ్ బుకింగ్ కాలేదు. అనంతరం రైడ్ ఓకే అయ్యాక అదే పరిస్థితి ఎదురైంది. చేసేదేమి లేక వారు అడిగినంత ఇచ్చేసి వెళ్లాను.
–రేణుక, ఐటీ ఉద్యోగి