ఆదిబట్ల, ఏప్రిల్ 22 : ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేస్తే సహించలేది లేదని ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డి హెచ్చరించారు. పులిందర్ వాగును మట్టితో పూడ్చి.. దర్జాగా రోడ్డేసి..అన్న శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి బుధవారం ఆమె స్పందించారు. ఇప్పటికే జిలాన్ఖాన్చెరువు, పులిందర్వాగును ఇరిగేషన్ అధికారులతో కలిసి రెవెన్యూ అధికారులు సందర్శించి మార్కింగ్ ఇచ్చారని.. చెరువును కబ్జా చేసి అక్రమంగా ఏర్పా టు చేసిన రేకులను వెంటనే తొలగించాలని వెంచర్ నిర్వాహకులను ఆదేశించామన్నారు. రెండు రోజుల్లో తొలగించాలని.. లేకుంటే తామే తీసివేస్తామని వెంచర్ యజమానులను హెచ్చరించారు. కాగా, బుధవారం ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ ఏఈ స్టాలిన్ జిలాన్ఖాన్చెరువు, పులిందర్ వాగులో కబ్జాచేసి రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీని దగ్గరుండి తొలగించారు. మిగిలిన వాటిని రెండు రోజుల్లో తొలగిస్తామన్నారు.
అడ్డగోలుగా చెరువులు, వాగులకు ఎన్వోసీలు
చెరువులు, వాగులకు నిబంధనలకు విరుద్ధంగా ఎన్వోసీలు జారీ చేశారంటే ఇక్కడ ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. చెరువులు, కుంటలు ఉన్న పరిసరా ల్లో వెంచర్లు, విల్లాలు నిర్మించేందుకు అధికారులు అనుమతులు ఇవ్వొద్దు. కానీ, జిలాన్ఖాన్చెరువు, పులిందర్వాగు పక్కన వెంచర్ల నిర్మాణానికి అధికారులు లంచాలు తీసుకుని ఎన్వోసీలను రెండేండ్ల కిందటే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. వాటి ఆధారంగానే ఆ స్థలాల్లో వెంచర్లు చేసేందుకు పర్మిషన్లు హెచ్ఎండీఏ నుంచి పొందారు. ఈ విషయమే ‘నమస్తే తెలంగాణ’ హెచ్ఎండీఏలోని ఓ అధికారిని ప్రశ్నించగా.. కింది స్థాయిలో రెవె న్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ఇచ్చిన ఎన్వోసీ ప్రకారమే అనుమతులు ఇస్తామని ఆయన చెప్పారు.