పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 5వ వార్డు కౌన్సిలర్లకు జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ గురువారం మున్సిపాల్లి రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్న సమయంలోనే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన జారీ చేసిన షోకాజు నోటుసులకు మూడు రోజులలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాల్టీలోని 5వ వార్డులో గల ఓ భవన నిర్మాణానికి ఎన్వోసి జారీ చేసేందుకు గత కమిషనర్ ఖమర్ అహ్మద్తో కలిసి చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణరెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ అనురాధలు రూ. 32లక్షలను చెక్కు రూపంలో తీసుకున్నారని ఫిర్యాదులు, పలు పత్రికలలో, న్యూస్ ఛానల్లలో కథనాలు రావడంతో పరిశీలించిన కలెక్టర్ వీరికి నోటీసులు జారీ చేశారు.
ఈ విషయంలో ఇప్పటికే కమిషనర్ ఖమర్ అహ్మద్ సస్పెండ్ అయ్యారు. 5వ వార్డు పరిధిలోని మహావీర్ ఇన్ఫ్రా అనే నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి మున్సిపాల్టీ నుంచి ఎన్వోసి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, స్థానిక కౌన్సిలర్ బోర అనురాధలు కమిషనర్తో కలిసి 40లక్షలు డిమాండ్ చేశారు. అయితే తాము చెక్ రూపంలో 32లక్షల రూపాయలను చెల్లించామని, అయినప్పటికీ తాము నిర్మించిన భవనాన్నీ పై అధికారులతో కలిసి కూల్చి వేయించారని మహావీర్ సంస్థ ఎండి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
వీటన్నింటిపై పలు ఛానల్లలో, వార్తపత్రికలలో వచ్చిన కథనాలను పరిశీలించిన మూడు రోజులలో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. షోకాజు తీసుకున్న వారు సరైన విధంగా వివరణ ఇవ్వకుంటే కొత్త మున్సిపల్ చట్టం కింద చర్యలు తప్పవని ఉన్నత అధికార వర్గాల నుంచి సమాచారం. ఏది ఏమైనా రెండో వార్షికోత్సవ సంబురాలలో ఉన్న వీరికి ఈ షోకాజుతో షాక్ తగిలినట్లైంది.