ఇబ్రహీంపట్నం, ఆగస్టు 31 : ఇబ్రహీంపట్నంలో ప్రగతి పనులు పరుగులు పెడుతున్నాయి. అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరువతో నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తుండటంతో ఇబ్రహీంపట్నం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. చెరువుకట్టపై తరుచుగా ప్రమాదాలు జరుగుతుండటం వలన కొత్తగా బైపాస్ రోడ్డు వేసి ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేశారు. వర్షపునీరు వృథా కాకుండా చెరువులోకి రావటం కోసం చెరువుకు నీరందించే ప్రధాన కాల్వలను మరమ్మతులు చేసి చెరువు నిండుకుండలా తయారయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు.
రూ.9.50 కోట్లతో చెరువు సుందరీకరణ పనులు
రూ.9.50 కోట్లతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణకు పనులు ప్రారంభమయ్యాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరువతో చెరువును అభివృద్ధి చేస్తున్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చెరువుకట్ట సుందరీకరణ పనులకోసం రూ.9.50 కోట్లను తీసుకువచ్చారు. శేరిగూడవైపు నుంచి చెరువుకట్టపైన చెట్లను తొలగించి కట్టను వెడల్పు చేసే పనులు ప్రారంభించారు. చెరువువైపు నుంచి కట్టకున్న ముళ్లపొదలను తొలగించి పర్యాటకులను ఆకర్షించే విధంగా పూలమొక్కలను నాటుతున్నారు. సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉన్న ఇబ్రహీంపట్నం చెరువుకట్టను చెరువువైపు పూర్తిగా సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. పర్యాటకులు సేద తీరేందుకు చెట్లను పెంచటంతో పాటు మధ్యలో కూర్చోవటం కోసం బెంచీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. చిన్నతూము, పెద్దతూము వద్ద కూడా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం హెచ్ఎండీఏ ఇప్పటికే మాస్టర్ప్లాన్ను రూపొందించింది.
రూ.4కోట్లతో బోటింగ్, కాటేజ్ల నిర్మాణం
చెరువు సుందరీకరణ పనులతో పాటు చెరువులో బోటింగ్తో పాటు చెరువు సమీపంలోని ఉప్పరిగూడ వైపు కాటేజ్ల నిర్మాణం కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువులో బోటింగ్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులను త్వరలో ఇప్పిస్తామని, బోటింగ్ కోసం వచ్చే పర్యాటకులకు రిసార్ట్స్, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని తెలిపారు. ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్న చెరువు సుందరీకరణతో పాటు బోటింగ్వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మారనున్న చెరువు రూపురేఖలు
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు కట్ట సుందరీకరణతో పాటు బోటింగ్వంటి సౌకర్యాలు కల్పిస్తే పెద్దచెరువు స్వరూపమే మారనుంది. ఇప్పటికే చెరువు రెండు తూముల వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది. దీనికి తోడు చెరువుకట్టను సుందరీకరిస్తే పర్యాటకులు మరింత పెరిగే అవకాశముంది.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం