అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 28 : అభివృద్ధి చేసే వారినే ప్రజలు ఆశీర్వదించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఎన్నడూ కనిపించని వారు ఎన్నికల సమయంలో వచ్చి ఏదో చెపితే ప్రజలు నమ్మవద్దని కోరారు. ప్రజలను దోసుకొని దాసుకునే వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. గడిచిన పదేండ్ల కాలంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.
ఎక్కడో ఏర్పాటు చేసే ఫాక్స్కాన్ కంపెనీని మన నియోజకవర్గానికి తీసుకొచినట్లు తెలిపారు. కంపెనీ ద్వారా 10 వేల నుంచి 12 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రతిపక్షాల దిమ్మెతిరిగేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉందన్నారు.
వచ్చే మార్చి తర్వాత రూ. 400లకు వంట గ్యాస్ ఇస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 93 లక్షల రేషన్ కార్డు దారులకు సన్యబియ్యం ఇస్తామన్నారు. ఆసరా పింఛన్ను రూ. 5016, దివ్యాంగులకు రూ. 6016, అర్హులైన పేద మహిళలకు రూ.3 వేలు ఇస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వమే పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని తెలిపారు. ఇప్పటి వరకు అనాజ్పూర్ గ్రామానికి చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, సీనియర్ నాయకులు జక్క రాంరెడ్డి, సర్పంచ్ కావలి రంగయ్య, ఎంపీటీసీ రాచపాక లావణ్య, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పూజారి చక్రవర్తిగౌడ్, మాజీ సర్పంచ్ సిలివేరు యాదయ్య, నాయకులు గుర్జని వెంకటేశ్గౌడ్, కావలి రాములు, తుమ్మలపల్లి భూపాల్రెడ్డి, కావలి నర్సింహ, నార్లకొండ జంగమయ్య, మొగుళ్ల జీవన్కుమార్రెడ్డి, ఇంజమూరి రవీందర్, కావలి శ్రీశైలం, రవీందర్గౌడ్, కార్యకర్తలు తదిరతులు పాల్గొన్నారు.