యాచారం : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ కొప్పు సుకన్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబురాన్నంటాయి. మహిళలు, ఆడపడుచులు ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో బతుకమ్మ ఆడారు. ప్రముఖ జానపద కళాకారుడు జంగిరెడ్డి బృందం జానపదం, ఆధ్యాత్మికం, బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ అలరించారు. మహిళలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ పాటలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఆశ వర్కర్లు, ఉద్యోగులు కోలాటమాడుతూ ఆకట్టుకున్నారు. దీంతో మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం ఒక్కసారిగా మారుమోగింది.
బతుకమ్మ పోటీల్లో విజయం సాధించిన విజేతలకు బహుమతులను అందజేశారు. మహిళా ప్రజాప్రతినిధులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ శ్రీలత, సూపరింటెండెంట్ శైలజ, పశువైద్యాధికారిణి వనజ, సహకార సంఘం డైరెక్టర్లు మక్కపల్లి స్వరూప, మద్దెల శశికళ, బీజేపీ దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, సర్పంచ్ పెద్దయ్య తదితరులు ఉన్నారు.