సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ అనుమతుల్లో ఒకే విధానాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట హెచ్ఎండీఏ పరిధిలోని 40 మున్సిపాలిటీలు ఉండగా, గ్రామాలు 719 వరకు ఉన్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు లోపల సైతం హెచ్ఎండీఏ పరిధిలో కొన్ని గ్రామాలు ఉన్నాయి.
ఇక్కడ భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం వస్తుండడంతో అక్రమ కట్టడాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలకు జీ ప్లస్ 2 వరకే అనుమతి ఇచ్చే అవకాశం ఉండడంతో కొందరు 3,4,5 అంతస్తులతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన హెచ్ఎండీఏ పూర్తి స్థాయిలో టీఎస్ బీపాస్ను గ్రామాల్లో అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
ఇందుకు అనుగుణంగానే హెచ్ఎండీఏ పరిధిలో పూర్తి స్థాయిలో టీఎస్ బీ పాస్ ద్వారానే అనుమతులు ఇచ్చేందుకు వీలుగా సాఫ్ట్వేర్ను రూపొందించే పనిని ఐటీ కన్సల్టెన్సీలకు అప్పగించారు. ఇదిలా ఉంటే… సోమవారం హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి అధ్యక్షతన ఇద్దరు ప్లానింగ్ డైరెక్టర్లు, 4 ప్లానింగ్ ఆఫీసర్స్తో పాటు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ రూపొందించే ఐటీ నిపుణులతో ప్రత్యేకంగా చర్చించారు.
2 నుంచి 3 నెలల వ్యవధిలో డీపీఎంఎస్ను పూర్తి స్థాయిలో టీఎస్ బీపాస్ పరిధిలోకి తీసుకొచ్చేలా సాఫ్ట్వేర్ అప్లికేషన్ను రూపొందిస్తామని ఐటీ నిపుణులు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల ప్రజల సౌకర్యం కోసం డీపీఎంఎస్ను 2-3నెలల పాటు కొనసాగించాలని, ఫిబ్రవరి 5న మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించారు.