వికారాబాద్, జనవరి 20: జంతువులను హింసించకుండా, వాటిపై కరుణతో ఉంటూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జంతు సంక్షేమానికి ప్రతి పౌరుడు విధిగా పా టించాల్సిన నిబంధనలపై జంతుహింస నివారణ సంఘం రూపొందించిన కరపత్రాన్ని అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఆర్డీవో అశోక్కుమార్, జిల్లా పశువైద్య,పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్కుమార్తో కలిసి ఆమె ఆవిష్కరించి మాట్లాడారు.
జం తు సంరక్షణకు కృషి చేసే వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. వన్యప్రాణులు కనిపిస్తే వాటి ని అటవీశాఖ అధికారులకు అప్పగించాలన్నారు. ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగ నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ నిఖిల అన్నారు. నిర్మల్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రతిభను చాటి జాతీయ స్థాయికి ఎంపికైన జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు శుక్రవారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రేణుకాదేవి, విశ్వేశ్వర్రెడ్డి ఉన్నారు.