ఆమనగల్లు, జనవరి 28 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల నిధులను మంజూరు చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలో సెర్వ్ స్వచ్ఛంద సంస్థ సమాకూర్చిన 5 ట్రై సైకిళ్లు , దుప్పట్లు, ఊత కర్రలు, నోట్పుస్తకాలను సంస్థ డైరెక్టర్ అనిల్కుమార్, ప్రెసిడెంట్ మీనాక్షితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణ కోసం జాతీయ రహదారిని నాలుగు వరసలుగా నిర్మించాలని కోరుతూ తాను ఆసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయడంతో ప్రభుత్వం రూ.1723 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఆమనగల్లు పురపాలక సంఘం పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామం నుంచి మాడ్గుల మండలం కలకొండ వరకు రెండు వరుసల బీటీ రోడ్డు మరమ్మతుల కోసం రూ.2 .10 కోట్లు, నుచ్చగుట్ట తండా సమీపంలో వంతెన నిర్మాణానికి రూ. కోటి నిధులు, పట్టణంలోని సందబావి నుంచి తలకొండపల్లి మండల కేంద్రం వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి రూ. 37 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
ఆమనగల్లు పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని వివరించారు. ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ ద్వారా సీసీ రోడ్లు, భూగర్భ మురుగు కాల్వలు, సురసముద్రం చెరువు సుందరీకరణ, బతుకమ్మఘాట్ నిర్మాణ పనులకు 15 కోట్లు విడుదల చేశామన్నారు. ఇవేకాకుండా అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల గౌడ సంఘం నాయకుడు గుండ్రాతి కుమార్ గౌడ్ మండల పరిషత్ ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, ఎంపీటీసీలు దొనాదుల కుమార్, సరిత, మాజీ వార్డు సభ్యుడు జంతుక అల్లాజీ, నాయకులు కిరణ్, వెంకటేశ్. భాస్కర్, రమేష్, శివ పాల్గొన్నారు.
సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలి
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయ భవనంలో శనివారం ఎంపీపీ అనిత అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని, వెంటనే సమావేశానికి హాజరయ్యే విధంగా పిలిపించాలని ఎంపీడీవో ఫారుక్ హుస్సేన్ను అదేశించారు. సమావేశంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. వివిధ శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. అధికారుల ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాలపురం శ్రీనివాస్ రెడ్డి, ఏవోఅరుణ కుమారి, సీడీపీవో సక్కు బాయి, ఎంపీవో శ్రీలత, ఏపీఎం కృష్ణయ్య, ఏఈలు కృష్ణయ్య, వాగ్దేవి, శరత్, డాక్టర్ పరిక్షిత్ ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.