సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ ఎట్టకేలకు ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న హెచ్ఎండీఏ వేల కోట్ల రూపాయలతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులను చేపట్టింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. దీనిపై నమస్తే తెలంగాణలో పలు కథనాలు వచ్చాయి.
వీటిపై స్పందించిన ఉన్నతాధికారులు ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు అవసరమైన బడ్జెట్ అంచనాలను రూపొందించి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ బుద్వేల్లో 182 ఎకరాల్లో హెచ్ఎండీఏ చేపట్టిన లేఅవుట్లో అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.354 కోట్లు, అదేవిధంగా మోకిలలో చేపట్టిన లేఅవుట్లో మౌలిక వసతుల కల్పన కోసం మరో రూ.47 కోట్లతో కలిపి రెండు టెండర్లను హెచ్ఎండీఏ ఆహ్వానించింది. ఎన్నికల కోడ్ మూలంగా నవంబర్, డిసెంబర్ నెలలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు నెలలు కలిపి దాదాపు 4 నెలల తరువాత టెండర్లు ఆహ్వానించడం శుభపరిణామం.
అయితే ఇవేకాకుండా మూసీ,ఈసీ నదులపై 5 చోట్ల హైలెవల్ బ్రిడ్జిలను నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేనాటికి ఎన్నికలు వచ్చాయి. అలాగే 85 ఎకరాల్లో చేపట్టిన కొత్వాల్ గూడ పార్కు పనులు, బాచుపల్లి జంక్షన్లోని ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు 2-3 నెలలుగా నిలిచిపోయాయి. వీటితో నగర శివారు ప్రాంతాల్లో 6 చోట్ల (బుద్వేల్, మోకిల, తొర్రూరు, బహుదూర్పల్లి, బాచుపల్లి, తుర్కయాంజాల్) చేపట్టిన హెచ్ఎండీ లేఅవుట్లలో అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. తాజాగా ఇందులో రెండు లేఅవుట్లకు సంబంధించిన పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు.