ఇబ్రహీంపట్నం / ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 6 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 24గంటలుగా కురిసిన కుండపోత వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతుండటంతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు ప్రధానంగా నీరందించే పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. పెద్దవాగుతో పాటు రాచకాల్వ, పులిందర్ వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి. పెద్దచెరువు నిండుకుండలా మారటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 36అడుగులకు చేరిన నీరు మరో రెండు మూడు అడుగుల నీరు చేరితే అలుగుపారే అవకాశమున్నది. మండలంలోని రాయపోల్ చెరువు, పొల్కంపల్లి నాగులమ్మ చెరువులు మత్తడి పారడంతో గ్రామప్రజలు మత్తడి వద్దకు వెళ్లి సరదాగా గడిపారు.
మండలంలో దంచికొట్టింది..
కడ్తాల్, అక్టోబర్ 6: మండల కేంద్రంతోపాటు పరిధిలోని గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి వాన దంచి కొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు చెరువులు, కుంటలు నిండగా, వాగులు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని గుర్లకుంట, ఉప్పారాశి కుంట, అన్మాస్ చెరువు, గౌరమ్మ చెరువు, దేవరా చెరువు, నాగిరెడ్డి కుంట అలుగు పారుతున్నాయి. మండలంలోని గానుగుమార్ల తండాలోని రైతు నేనావత్ లక్ష్మికి చెందిన ఆవు మృతి చెందింది. మృతి చెందిన ఆవు విలువ రూ.85వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని లక్ష్మి కోరారు.
షాబాద్లో..
షాబాద్, అక్టోబర్ 6: షాబాద్ మండలంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు వర్షం పడింది. మండలంలోని ఆయా గ్రామాల్లో చెరువుల్లోకి నీరు వచ్చి చేరింది.
మరో రెండు రోజులు వర్షాలు
కొత్తూరు, అక్టోబర్ 6: గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి కొత్తూరు మండల వ్యాప్తంగా 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తహసీల్దార్ రాములు తెలిపారు. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కేశంపేటలో భారీగా..
కేశంపేట, అక్టోబర్ 6 : కేశంపేట మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు గ్రామాల మీదుగా ఉన్న పెద్దవాగు ఉధృతంగా సాగుతున్నది. వాగుపై పలు చోట్ల నిర్మించిన చెక్డ్యాంలు అలుగులు పారుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
షాద్నగర్లో మోస్తరు..
షాద్నగర్టౌన్, అక్టోబర్ 6 : షాద్నగర్లో గురువారం ఉదయం నుంచి చల్లటి గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.