బంట్వారం, మార్చి 3 : ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. మండలంలోని రొంపల్లిలో శుక్రవారం కలెక్టర్ పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మొక్కల పెంపకం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించాడని స్థానిక ఎఫ్ఏ శంకరయ్యను కలెక్టర్ సస్పెన్షన్ చేశారు. మొక్కలకు పాదులు తీయకుండా, చెత్తాచెదారం పేరుకుపోవడంతో కలెక్టర్ ఏపీవో సుధాకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధుల్లో అప్రమత్తంగా ఉండి సేవ చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగాలను వదిలేసుకోవాలన్నారు. మరోసారి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
మధ్యాహ్న భోజనం ఏర్పాట్లపై ఆరా..
అంతకు ముందు స్థానిక ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యా విధానం, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని, వారంలో రెండు సార్లు గుడ్లు ఇవ్వాలని హెచ్ఎం సతీశ్ను, ఎంఈవో చంద్రప్పలకు సూచించారు. అలాగే గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతరం గ్రామ రైతులతో ముచ్చటించారు. భూ సమస్యలు, పంట పొలాలకు వెళ్లే దారుల విషయాలపై పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి వచ్చే శనివారం రెవెన్యు అధికారులను పిలిపించి, ఇక్కడే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. గ్రామంలో నిర్మించిన నూతన సీసీ రోడ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన రోడ్ల పనులను ఈనెల 15లోపు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో బాలయ్య, ఎంపీవో విజయ్కుమార్, ఎంపీటీసీ శ్రీకాంత్రెడ్డి, ఏపీవో సుధాకర్, జడ్పీటీసీ సంతోష, సర్పంచ్లు లావణ్య, నర్సింహులు తదితరులు ఉన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించాలి
మోమిన్పేట : మున్సిపాలిటీ పరిధిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పట్టణ ప్రగతి, పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు, అటెండెన్స్ యాప్లపై అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ విధుల్లో నిర్వక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి సోమవారం మున్సిపాలిటీలో నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.