వికారాబాద్, జూన్ 27 : గ్రూప్ 4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో గ్రూప్ 4 పరీక్ష నిర్వహణపై ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్, లైసెన్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి 5గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుందన్నారు.
జిల్లాలో మొత్తం 18,120 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారన్నారు. మొత్తం 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు అనుమతించరాదన్నారు. పరీక్షా కేంద్రాలకు ఉదయం 9:45, మధ్యాహ్నం 12:15 గంటల తరువాత అభ్యర్థులను అనుమతించరాదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్గంగ్వార్, రెవెన్యూ అధికారి అశోక్కుమార్, డీఆర్డీవో కృష్ణన్, పరీక్ష నిర్వహణ అధికారులు పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ
ఏఎన్ఎం ఉద్యోగాల కోసం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేయడానికి దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 2023-24సంవత్సరానికి ఏఎన్ఎం ఉద్యోగాల కోసం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వయస్సు 18 నుంచి 44 సంవత్సరాలు, దరఖాస్తుదారు 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండి, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో 18 నెలలు ఏఎన్ఎం శిక్షణలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
గిరిజన విద్యా సంస్థలో పని చేసిన అనుభవం కలిగిన వారికీ 20శాతం వెయిటేజ్ ఇవ్వనున్నారు. ఎంపిక అర్హత పరీక్షలో మెరిట్ మార్కులు, టీడబ్ల్యూడీ విద్యా సంస్థల్లో పని చేసిన అనుభవానికి వెయిటేజ్ ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. జీతం నెలకు రూ.22,750 ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇస్తారని తెలిపారు. పోస్టులు 15 ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజన బాలికల పాఠశాలలో కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 3 నుంచి 13వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8639388553 నంబర్కు సాయంత్రం 5 గంటల వరకు పనిదినాల్లో సంప్రదించాలని సూచించారు.