బొంరాస్పేట, ఫిబ్రవరి 17 : మార్కెట్లో వేరుశనగకు మంచి ధర పలుకుతున్నది. గత కొన్నాళ్ల నుంచి వేరుశనగ పంటకు ధరలు రాకపోవడంతో ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు నిరాశపడేవారు. కానీ ఈ ఏడాది మాత్రం వేరుశనగకు మంచి ధర పలుకడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. గత ఏడాది క్వింటాలు వేరుశనగకు రూ.5 వేల నుంచి రూ.5500 వరకే ధర వచ్చింది. ఈ ఏడాది మాత్రం క్వింటాలుకు రూ.7500 నుంచి రూ.8వేల వరకు ధర పలుకుతున్నది. ప్రారంభంలో ఈ ధర క్వింటాలుకు రూ.8200 కూడా ఉంది. మంచి ధర రావడంతో వేరుశనగ సాగు చేసిన రైతులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 9 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. విత్తనాలు వేసే సమయంలో అధికంగా వర్షాలు కురువడంతో పంట కొంత దెబ్బతిన్నదని, వర్షాలు కురువడం ఆగిపోయిన తరువాత విత్తనాలు వేసిన రైతులకు మంచి దిగుబడులు వచ్చాయని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. యాసంగిలో సాగు చేసిన వేరుశనగ పంట ప్రస్తుతం చేతికి వస్తున్నది. వచ్చిన పంటను కొందరు వ్యాపారులు పొలాల్లోనే కొనుగోలు చేస్తుండగా.. మరికొంతమంది రైతులు మార్కెట్కు తరలిస్తున్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు పండిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 21,691 ఎకరాల్లో వేరుశనగను రైతులు సాగు చేశారు. వ్యవసాయ బోర్ల కింద తుంపర్ల సేద్యం ద్వారా రైతులు ఎక్కువగా వేరుశనగను పండిస్తారు. జిల్లాలోని బొంరాస్పేట మండలంలో అత్యధికంగా 6485 ఎకరాల్లో వేరుశనగను సాగు చేశారు. బషీరాబాద్ మండలంలో 1900, చౌడాపూర్లో 810, ధారూరులో 656, దోమలో 3900, దౌల్తాబాద్లో 2190, కొడంగల్లో 1050, కోట్పల్లిలో 15, కులకచర్లలో 950, పరిగిలో 1100, పెద్దేముల్లో 530, తాండూరులో 650, వికారాబాద్లో 5, యాలాలలో 1450 ఎకరాల్లో సాగు చేశారు.
– రామకృష్ణయాదవ్, రైతు, బొంరాస్పేట
ఈ ఏడాది వేరుశనగ పంటకు మంచి ధర పలుకుతున్నది. 5 ఎకరాల్లో వేరుశనగ పంట వేస్తే 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాలుకు రూ.7900 ధర వచ్చింది. గత ఏడాది క్వింటాలుకు రూ.6200 మాత్రమే వచ్చింది. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల దిగుబడి కొంత తగ్గినా ధర మాత్రం కలిసి వచ్చింది.