Venugopala Swamy | మంచాల, ఫిబ్రవరి 13: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వేణుగోపాలస్వామి-రుక్మిణి-సత్యభామ రథోత్సవం కనుల పండువగా ముందుకు సాగింది. రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవంలో చిన్నా పెద్దా తేడా లేకుండా స్వామివారు కొలువుతీరిన రథోత్సవం లాగడానికి పోటీపడ్డారు.
గురువారం ఉదయం ఆరు గంటలకు వేణుగోపాలస్వామి దేవాలయం నుండి ప్రారంభమైన రథోత్సవం మధ్యాహ్నం ఒకటి గంటకు ఆరుట్ల ప్రధాన చౌరస్తాకు చేరుకున్నది. రథోత్సవం సందర్భంగా కళాకారుల ఆటాపాటలతో ముందుకు సాగింది. రథోత్సవానికి తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.