చేవెళ్లటౌన్, ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దవాఖానల్లో రోగులకు, ఆశ్రమాల్లో అనాథలకు పండ్ల్ల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టి కేసీఆర్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య కేక్ కట్చేసి అభిమానులకు పంచిపెట్టారు. పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు కేక్ తినిపించారు. జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఎమ్మెల్యే యాదయ్య పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా బీఆర్ఎస్ను స్థాపించిన గొప్ప యోధుడు కేసీఆర్ అని కొనియాడారు. రానున్న పార్ల మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాల్రాజ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, వైస్ ఎంపీపీ ప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింహులు, బీసీ సెల్ మండలాధ్యక్షుడు రాములు, పామెన ఎంపీటీసీ సత్యనారాయణ చారి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు వెంకటేశ్, సాయినాథ్, నేతలు పాల్గొన్నారు.