రంగారెడ్డి, మార్చి 28(నమస్తే తెలంగాణ): పన్ను వసూళ్లలో జిల్లాలోని పలు పంచాయతీలు రికార్డు సృష్టించాయి. 154 పంచాయతీలు వందశాతం వసూలుతో ఆదర్శంగా నిలిచాయి. గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల పాలన ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తవ్వగా.. ఆతర్వాత ప్రత్యేక పాలన కొనసాగుతున్నది. కొన్ని పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సమష్టిగా పనిచేసి పన్నుల వసూలు లక్ష్యాన్ని పూర్తి చేశారు.
శతశాతం సాధించిన పంచాయతీల్లో ఎక్కువగా తండాలు ఉండగా.. ఆయా ఆవాసాల ప్రజానీకం పన్నుల చెల్లింపులో పట్టణ వాసులకు స్ఫూర్తిగా నిలిచారు. జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు 81 శాతం పన్నులు వసూలయ్యాయి. ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో వందశాతం లక్ష్యాన్ని పూర్తిచేసే దిశగా మిగతా పంచాయతీల అధికారులు పరుగులు పెడుతున్నారు.
ప్రభుత్వం చేపడుతున్న పన్ను వసూలుకు పల్లెవాసులు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. గ్రామాభివృద్ధ్దిలో ఇంటి పన్ను కీలకపాత్ర పోషిస్తుండగా.. పన్నులు చెల్లించడం ద్వారా పంచాయతీల అభివృద్ధ్దిలో తమవంతు పాత్రను పోషిస్తున్నారు. గతంలో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటివి అధ్వానంగా ఉండడంతో పన్నులు చెల్లించేందుకు యజమానులు ముందుకు రాకపోయేవారు. కానీ.. గత పదేండ్లల్లో పల్లెల్లో వచ్చిన గణనీయమైన మార్పుతో ఇంటి పన్ను చెల్లించేందుకు చొరవ చూపిస్తున్నారు.
పంచాయతీల ఖజానాలో సరిపడా నిధులు ఉన్నప్పుడే కావాల్సిన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్న విషయాన్ని ప్రజానీకం గుర్తెరిగి అందుకనుగుణంగా వ్యవహరిస్తున్నది. మరోపక్క పన్ను చెల్లింపులపై అధికారులు అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. దీంతో ఒకప్పటిలా కాకుండా గ్రామాల్లో పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది జిల్లాలో 154 గ్రామ పంచాయతీలు వంద శాతం పన్నులు చెల్లించి ఆదర్శంగా నిలిచాయి. ఇందులో అత్యధికంగా మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లోని పంచాయతీలు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే వంద శాతం పన్నుల వసూలు లక్ష్యాన్ని చేరుకున్నాయి.
‘గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో అధికారులు లక్ష్యాన్ని చేరే దిశగా కృషిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 558 గ్రామ పంచాయతీలు ఉండగా 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.32.76కోట్ల ఇంటి పన్ను బకాయిలు ఉన్నాయి. ఆరంభంలో ఇంటి పన్ను ప్రక్రియ వేగవంతంగా సాగినప్పటికీ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పన్ను వసూలుకు బ్రేక్ పడింది.
ఎలక్షన్లు ముగిశాక అధికారులు మళ్లీ పన్ను వసూలుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రూ.26.58 కోట్ల ఇంటి పన్ను వసూలైంది. ఇంకా రూ.6.18కోట్ల బకాయిలను వసూలు చేయాల్సి ఉన్నది. పన్ను చెల్లింపునకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో వసూలు ప్రక్రియను సంబంధిత అధికారులు మరింత వేగవంతం చేశారు.