షాబాద్, డిసెంబర్ 24: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని(కేజీబీవీ) బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకున్నది. విద్యార్థినులకు గతంలో 15 రకాల వస్తువులతో కూడిన హెల్త్కిట్లు ఇస్తుండగా.. ఇక నుంచి వాటికి బదులుగా ఒక్కో విద్యార్థినికి నెలకు రూ.100 నగదు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు విద్యార్థినుల బ్యాంకు ఖాతాల వివరాల ను ఇప్పటికే సేకరించారు. రంగారెడ్డి జిల్లాలో 20 కేజీబీవీలు అందులో 5,200 మంది విద్యార్థిను లు చదువుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 20 కేజీబీవీలు
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు(కల్వకుర్తి), రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 20 కేజీబీవీ పాఠశాలలుండగా, అందులో 10 పాఠశాలలు అప్గ్రేడ్ కావడంతో ఇంటర్ వరకు విద్యార్థినులు చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 5,200 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. కేజీబీవీల్లో పేద విద్యార్థులే అధికంగా చదువుకుంటుండగా.. ప్రభుత్వం ఉచిత విద్యతోపాటు వసతి, భోజనం, ఇతర వసతుల ను కల్పిస్తున్నది. అయితే కొవిడ్ మహమ్మారికి ముందు విద్యార్థినులకు 15 రకాల వస్తువులతో కూడిన హెల్త్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేసేది. కొవిడ్ కారణంగా రెండేండ్లుగా వాటి పంపిణీ నిలిచిపోయింది. ఆరోగ్యానికి, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులను సమకూర్చుకు నేందుకు విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఆరోగ్య కిట్ల స్థానంలో నగదు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు విద్యార్థినుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలను ఇప్పటికే సేక రిం చారు. కొంతమందికి ఖాతాలు లేవని తేలడంతో ఆధార్తోపాటు సదరు ప్రక్రియనూ పూర్తి చేశా రు. త్వరలోనే జిల్లాలోని 5,200 విద్యార్థినులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.వంద చొప్పున డబ్బులు జమ కానున్నాయి.
బ్యాంకు ఖాతా వివరాలు పంపించాం
హెల్త్కిట్ల స్థానంలో విద్యార్థినులకు నగదు అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జిల్లాలోని 20 కేజీబీవీల్లో చదువుకుంటున్న 5,200 మంది స్టూడెంట్స్ నుంచి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి ఉన్నాతాధికారులకు పంపిం చాం. ఖాతాలు లేని వారి తో కొత్త ఖాతాలను ఓపెన్ చేయించడం పూర్తైంది. త్వరలో విద్యార్థినుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.
-ఉషారాణి, కేజీబీవీ పాఠశాలల రంగారెడ్డిజిల్లా అధికారి