బొంరాస్పేట, మార్చి 21 : ప్రభుత్వ పాఠశాలల్లో నిధుల వినియోగానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లను ప్రభుత్వం రద్దు చేసింది. అంతకుముందు ఎస్ఎంసీ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి జాయింట్ చెక్పవర్తో నిధులు డ్రా చేసేవారు. కానీ కమిటీల రద్దు తర్వాత కొత్త ఎస్ఎంసీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెక్ పవర్ సమస్య ఏర్పడింది.
దీంతో మూడు నెలలుగా పాఠశాల నిర్వహణ నిధులు వినియోగించలేని పరిస్థితి నెలకొన్నది. ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వం ఎస్ఎంసీ చైర్మన్ల స్థానంలో హెచ్ఎంతోపాటు పాఠశాలలోని మరో టీచర్కు జాయింట్ చెక్పవర్ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎస్ఎంసీ ఖాతాల్లోని నిధులను వినియోగించుకోవడానికి అవకాశం కలిగింది.
వికారాబాద్ జిల్లాలో 776 ప్రాథమిక, 176 ఉన్నత, 116 ప్రాథమికోన్నత కలిపి మొత్తం 1068 పాఠశాలలు ఉన్నాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం ఏటా వివిధ గ్రాంట్ల కింద రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు నిధులను విడుదల చేస్తున్నది. ఈ నిధులను ఏడాదిలో రెండు విడుతల్లో పాఠశాలల ఎస్ఎంసీల ఖాతాల్లో జమ చేస్తున్నది. స్టేషనరీ, జాతీయ పండుగల నిర్వహణ, చిన్న చిన్న మరమ్మతులు, ఇంటర్నెట్ చార్జీలు, కంప్యూటర్లు, ల్యాబ్ల నిర్వహణ, విద్యుత్ బిల్లులు, తాగునీరు తదితరాల కోసం వినియోగిస్తుంటారు. ఎస్ఎంసీ కమిటీలు రద్దు కావడం, వాటి స్థానంలో కొత్త వాటిని ఎన్నుకోకపోవడంతో నిధులు వినియోగించలేని పరిస్థితి నెలకొన్నది. వివిధ గ్రాంట్ల కింద విడుదలైన నిధులు ఎస్ఎంసీల ఖాతాల్లోనే ఉండిపోయాయి.
దీనివల్ల పాఠశాలల నిర్వహణ కష్టంగా ఉందని ఉపాధ్యాయులు వాపోతున్న తరుణంలో ప్రభుత్వం చెక్పవర్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల హెచ్ఎంతో పాటు సీనియర్ ఉపాధ్యాయుడికి జాయింట్ చెక్పవర్ కల్పించింది. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నచోట స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంకు జత చేస్తూ చెక్పవర్ కల్పించారు. కొత్త ఎస్ఎంసీలు ఏర్పాటయ్యే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. చెక్పవర్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు వెలువడడంతో హెచ్ఎంలు బ్యాంకుల్లో తదనుగుణంగా మార్పులు చేసుకుంటున్నారు.
గతేడాది ప్రారంభించిన మన ఊరు-మన బడి, మనబస్తీ-మనబడి కార్యక్రమాల కింద చేపట్టిన పనులన్నీ పాఠశాల విద్యా కమిటీల పర్యవేక్షణలోనే కొనసాగాయి. కమిటీలను రద్దు చేయడంతో చెక్పవర్కు వెసులుబాటు లేక నిధులు డ్రా చేయలేక పనులు చేసిన వారికి బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ఎస్ఎంసీ కమిటీలను రద్దు చేసిన తర్వాత చైర్మన్ స్థానంలో ఎవరికీ చెక్పవర్ ఇవ్వకపోవడంతో ఖాతాల్లోని నిధులను వినియోగించలేని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం చైర్మన్ స్థానంలో సీనియర్ టీచర్కు జాయింట్ చెక్వపర్ కల్పించడం హర్షణీయం. దీంతో పాఠశాలల నిర్వహణకు నిధులను వినియోగించుకునే అవకాశం కలిగింది.
-రవీందర్గౌడ్, హెచ్ఎం, పూర్యానాయక్తండా