శంషాబాద్ రూరల్, డిసెంబర్ 5 : గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సోమవారం శంషాబాద్లో రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఆస్థిరపరచాలని చూస్తున్నదని విమర్శించారు. ఎమ్మెల్యేలను కోనుగోలు చేయడానికి అనేక కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. ఇప్పటికే దేశంలో ఎన్నో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి కార్పొరేట్ సంస్థలకు లాభాలు తెచ్చిపెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీల పేరుతో ఎమ్మెల్యేలను భయభ్రావతులకు గురిచేసి తమ పార్టీలోకి లాక్కోవడానికి కుట్రలు చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. రాబోవు కాలంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటాలు నిర్వహిస్తామని.. ఇల్లులేని నిరుపేదలకు ఇండ్లతో పాటు భూమిలేనివారికి అండగా సీపీఐ ఆధ్వర్యంలో మద్దతు ఉంటుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జంగయ్య, కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి, పుస్తకాల నర్సింగ్రావు, మాజీ ఎమ్మెల్యే రాములు, పలువురు నాయకులు పాల్గొన్నారు.