దివ్యాంగ బాలికల సంక్షేమానికి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. వారి శారీరక, మానసిక ఎదుగుదల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా దివ్యాంగ బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించడంపై జిల్లా స్త్రీ,శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖల అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం చేపట్టిన ‘న్యూట్రి కిట్స్’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా జిల్లావ్యాప్తంగా 11-15 ఏండ్ల దివ్యాంగ బాలికలకు బలవర్ధకమైన ఆహార పదార్థాలతో కూడిన కిట్లను అందిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 400 మందికి పైగా బాలికలకు పంపిణీ చేశారు. అలాగే రోజువారీగా పోషక విలువలు కలిగిన భోజనంతోపాటు పాలు, గుడ్లు అందిస్తున్నారు. అంతేకాకుండా అత్యాధునిక డిజిటల్ పరికరాలు, రూ.50 వేల నుంచి రూ.3లక్షల వరకు సబ్సిడీపై రుణాలను అందిస్తూ వారు జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా తోడ్పాటునందిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్వహించే దివ్యాంగ బాలికల గ్రోత్ మానిటరింగ్లో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది.
-రంగారెడ్డి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకే కాకుండా సామాజికంగా అణగారిన పలు వర్గాలకు ఆర్థికంగా చేయూతను ఇస్తూ వారి అభ్యున్నతికి తోడ్పాటును ఇస్తున్నది. దివ్యాంగులు కూడా సమాజంలో తలెత్తుకుని, ఆత్మ గౌరవంతో బతికేలా జీవితంపై భరోసాను కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో దివ్యాంగ బాలికలకు పౌష్టిక ఆహారాన్ని అందించడమే కాకుండా వారికి అత్యాధునిక డిజిటల్ పరికరాలు, సబ్సిడీపై రుణాలను అందిస్తూ వారు ఆర్థికంగా పురోగమనంలో సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థులకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ల్యాప్టాప్లు అందిస్తూ.. వారు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగేలా ప్రభుత్వం చేయూతనిస్తున్నది. సర్కారు అందిస్తున్న భరోసాతో దివ్యాంగులు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. దివ్యాంగ బాలికల అభివృద్ధి, పురోభివృద్ధికి జిల్లా స్త్రీ, శిశు, సంక్షేమ, దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ తోడ్పాటునందిస్తున్నది. బాలికల అభివృద్ధికి, వారి శారీరక ఎదుగుదలకు పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
400 మందికి పైగా ‘న్యూట్రిషన్ కిట్స్’ పంపిణీ
రంగారెడ్డి జిల్లాలో 1600 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో ఎంతో మంది దివ్యాంగ బాలికలు ఉన్నారు. 11-15 ఏండ్ల వరకు గల బాలికల శారీరక, మానసిక ఎదుగుదలకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. ఇంకా డ్రాపౌట్ బాలికల ఎదుగుదల కోసం కూడా అడుగులు వేస్తున్నది. వారి ఎదుగుదలలో భాగంగా ప్రత్యేకంగా ‘న్యూట్రిషన్ కిట్స్’ను అందిస్తున్నది. న్యూట్రిషన్ కిట్ ‘పది కేజీల గోధుమలు, ఆవు నెయ్యి అర కిలో, ప్రొటీన్ బిస్కెట్స్ రెండు ప్యాకెట్లు, ఖర్జూర ప్యాకెట్ అర కిలో, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ పది, ఐరన్తో కూడుకొని ఉన్న జింక్ సిరప్ ఒకటి, వీటన్నిటితో కలుపుకొని ఒక జ్యూట్ బ్యాగ్’ను నెలవారీగా అందిస్తున్నారు. ఇవే కాకుండా రోజువారీ మంచి పౌష్టికాహారం, పాలు, గ్రుడ్డు, భోజనం అందిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండో దశలో రంగారెడ్డి జిల్లా
దివ్యాంగ బాలికల గ్రోత్ మానిటరింగ్లో రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో కామారెడ్డి జిల్లా ఉండగా, రెండో దశలో రంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలు నిలిచాయి. దివ్యాంగ పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు జిల్లా అధికార యంత్రాంగం ఏ విధంగా చేయూతనిస్తుందో.. ఈ ఫలితం చెప్పకనే చెబుతుంది. ప్రభుత్వం గ్రోత్ మానిటరింగ్లో, ప్రీ స్కూల్, విద్యా విధానంలో చేయూతను ఇస్తున్నది.
గ్రోత్ మానిటరింగ్ కోసం..
జిల్లాలో శారీరకంగా, మానసికంగా వెనుకబడిన పిల్లల పురోగతి కోసం ప్రభుత్వం, అంగన్వాడీలు, జిల్లా అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ఒక పూట పౌష్టిక విలువలు కలిగిన భోజనం అందిస్తూ పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతి నెలా కార్యాచరణను చేపడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఏడు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 25 కేంద్రాల్లో 63 మంది సూపర్వైజర్ అధికారులు విధులు చేపట్టాల్సి ఉంది. కాగా.. 40 మంది కార్యాచరణలో ఉన్నారు. మిగిలినవారిని అపాయింట్ చేసుకోవాల్సి ఉందని జిల్లా అధికారి తెలిపారు. నియామకాలు మరికొన్ని రోజుల్లో పూర్తి కానున్నాయి. ఐదు నుంచి ఆరు నెలలుగా ఈ కార్యాచరణ కొనసాగగా.. జిల్లాలో ఇప్పటికే ఏడు నుంచి 8 వందలకు పైగా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించారు. పలువురు జిల్లా సూపర్వైజర్ అధికారుల నేతృత్వంలో 567 మంది బాలికలు బరువు నేపథ్యంలో సాధారణ స్థాయి నుంచి మోస్తారు దశలోకి వచ్చారు.
మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి
దివ్యాంగులు పలు స్కీముల్లో లబ్ధి పొందేందుకు అధికారులు జారీ చేసిన సదరం ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఆయా పౌష్టికాహార కిట్లను అందుకునేందుకు స్థానిక, మండల, జిల్లా అధికారులను సంప్రదించాలి. ఆన్లైన్లో ఆయా స్కీముల కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 567 మంది దివ్యాంగ బాలికలు లబ్ధి పొందారు. వారు పౌష్టికాహారంతో పాటు, విద్యాపరమైన పలు మౌలిక సదుపాయాలను అందిపుచ్చుకుంటున్నారు. గ్రోత్ మానిటరింగ్లో జిల్లాను రాష్ట్రవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిపాం. ఇంకా దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న మరిన్ని సదుపాయాలు అందేలా కృషి చేస్తున్నాం. ఎలాంటి సందేహాలున్నా అధికారులను సంప్రదించవచ్చు.
– మోతి, జిల్లా స్త్రీ, శిశు, వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి
దివ్యాంగులకు రుణాలు
ప్రభుత్వం దివ్యాంగులకు అనుసరణీయమైన రుణాలను కూడా అందిస్తున్నది. సబ్సిడీ, సబ్సిడీ లేకుండా పలు రకాల రుణాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు రుణాలను తీసుకోవచ్చని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంటున్నది. ‘ఓబీఎంఎంఎస్’ ఆన్లైన్ బ్యాంకింగ్లో రూ.50 వేల కొరకు దరఖాస్తు చేసుకుంటే, 1:3 చొప్పున అధికారులు ఎంపిక చేయనున్నారు. కాగా, ఒకటి నుంచి మూడు లక్షల వరకు గల రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే బ్యాంక్ మేనేజర్లు, ఎంపీడీవోలు, మండల రిసోర్స్ పర్సన్లు, సీడీపీవోలు ఎంపిక చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.