వికారాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది అనంతగిరి కొండలు. అనంతగిరికా హవా లాకో మరిదోంకా దవా అనే నానుడి కూడా ఉన్నది. అనంతగిరి కొండల్లో ఉన్న ఔషధ మొక్కల గాలి పీల్చితే చాలు రోగాలు నయమవుతాయనే నమ్మకం ప్రజల్లో ఉన్నది. అభివృద్ధి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అనంతగిరిలో జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్మించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికిగాను అనంతగిరి కొండల్లోని 5 వేల చెట్లను తొలగించేందుకు నిర్ణయించినా, కేవలం మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలం కోసం 412 చెట్లను తొలగించేందుకు అటవీ శాఖ అనుమతులనూ మంజూరు చేసింది.
వికారాబాద్ అంటేనే అనంతగిరి హిల్స్ ప్రసిద్ధి. అలాంటి అనంతగిరి కొండల్లో పెద్ద మొత్తంలో చెట్లను తొలగించి ప్రాముఖ్యతను తగ్గించవద్దనే సదుద్దేశంతో కలెక్టర్ నారాయణరెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ స్థలాన్ని మార్పు చేశారు. రూ.118 కోట్ల అనంతగిరిలో ఎకో టూరిజం ప్లాన్ చేస్తున్న దృష్ట్యా మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని మరో చోటకు మార్చారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని శ్రీఅనంతపద్మనాభ కాలేజీకి సమీపంలోని బిల్లదాఖలాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. బిల్లదాఖలాలో 200 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది.
సంబంధిత భూముల్లో 30 ఎకరాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ శాశ్వత మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించిన స్థల మార్పు ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి అందజేయగా, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికిగాను ప్రభుత్వం ఇప్పటికే రూ.235 కోట్ల నిధులను కేటాయించిన సంగతి తెలిసిందే.
2023-24 విద్యా సంవత్సరం గత సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణం రెండేండ్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జిలా యంత్రాంగం చర్యలు చేపట్టిన దృష్ట్యా అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తాత్కాలికంగా మెడికల్ కాలేజీ తరగతులను నిర్వహిస్తున్నారు. టీబీ శానిటోరియంలోనే రెండేండ్లపాటు తరగతులను నిర్వహించేందుకుగాను ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే.
రెండు లెక్చర్ హాళ్లను, అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ల్యాబ్ గదులతో తాత్కాలిక మెడికల్ కాలేజీలో తరగతులు కొనసాగుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించారు. జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రతి ఏటా 100 సీట్లను పెంచనున్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుబంధ దవాఖాన నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 380 పడకలతో బోధనాసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకుగాను రూ.30 కోట్లతో ఏరియా ఆసుపత్రిపై మరో రెండంతస్తుల నిర్మాణాన్ని చేపట్టారు. 380 పడకల అనుబంధ దవాఖాన అందుబాటులోకి రానుండడంతో అన్నిరకాల వైద్య సేవలు జిల్లా కేంద్రంలో అందుబాటులోకి రానున్నాయి. బోధనాసుపత్రి అందుబాటులోకి వచ్చినట్లయితే 26 రకాల వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంతో కూడుకొని ఉన్న జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఒకట్రెండు నెలల్లో జిల్లా ప్రజలకు బోధనాసుత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి.
ఐసీయూ, ట్రామా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఇప్పటికే రెగ్యులర్ పోస్టుల్లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, చీఫ్ బయోకెమిస్ట్, మెడికో సోషల్ వర్కర్, గ్రేడ్-1, 2 సీనియర్, జూనియర్ రెసిడెంట్లు, ఈసీజీ టెక్నీషియన్, టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ విజిటర్, హెల్త్ ఎడ్యుకేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, ఫిజియో థెరపిస్ట్, ఆడియోమెట్రి టెక్నీషియన్, అప్టీషియన్, థియేటర్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్, బ్లడ్బ్యాంక్ అధికారి పోస్టులను మంజూరైన దృష్ట్యా సంబంధిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ వైద్య సేవలు మినహా మిగతా వైద్య సేవలకై తప్పనిసరిగా జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్లక తప్పడం లేదు. అత్యవసర వైద్య సేవలు పొందాలంటే హైదరాబాద్లోని ఏదో ఒక దవాఖానకు తీసుకుపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. మెడికల్ కాలేజీతోపాటు బోధనాసుపత్రి అందుబాటులోకి వస్తే అన్ని రకాల వైద్య సేవలు నిరంతరం అందుబాటులోకి రానున్నాయి.
అనంతగిరి హిల్స్కు ఉన్న ప్రాముఖ్యతను కాపాడేందుకుగాను ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ స్థలాన్ని మార్పు చేశాం. ముందు అనంతగిరిలో అనుకున్నప్పటికీ ప్రసిద్ధిగాంచిన అనంతగిరి కొండల్లో చాలా చెట్లను తొలగించాల్సిన పరిస్థితుల దృష్ట్యా మెడికల్ కాలేజీని బిల్లదాఖలాలోని 30 ఎకరాల్లో నిర్మించేందుకు నిర్ణయించాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తాం.
– సి.నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్