మొయినాబాద్ : పచ్చని తోరణాలు మంగళ వాయిద్యాలు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య చిలుకూరు బాలాజీ సన్నిధిలో గోదాకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరులో ధనుర్మాసం చివరి రోజు గోదా కల్యాణం నిర్వహించడం అనవాయితీగా కొనసాగుతుంది. అదే అనవాయితీతో గురువారం అర్చకులు పరవస్తు రంగాచార్యులు వేదపండితుల చేతుల మీదుగా ఆలయ ప్రాంగణంలోని అద్దాలమహల్లో వైభవంగా కళ్యాణం జరిపించారు. గోదాదేవి, శ్రీకృష్ణుడి కళ్యాణోత్సవం వెంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిల సన్నిధిలో నిర్వహించారు. మొదట ఆలయంలోని వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగిస్తూ అద్దాల మేడలొకి తీసుకొచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మండపంలో స్వామివారి, అమ్మవార్ల సమక్షంలో గోదాదేవి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. భక్తులు స్వామివారికి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవం పూరైన తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కల్యాణోత్సవం అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు రంగరాజన్ పాల్గొన్నారు.