సమస్య ఎలాంటిదైనా పరిష్కారం చూపుతామంటోందినేటి యువతరం. వారి వినూత్న ఆలోచనలే సరికొత్తఆవిష్కరణలుగా మారుతున్నాయి. అందుకు నిదర్శనం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలనుప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ హబ్ వేదికగా ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు రకరకాల సమస్యలకు విభిన్న పరిష్కార మార్గాలతో ముందుకు వచ్చారు.
– సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ)
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) నిర్వహించిన ‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు. బుధవారం టీ హబ్లో నిర్వహించిన ఇన్నోవేషన్ షోకేజ్ కార్యక్రమంలో 10 ఆవిష్కరణలను ప్రదర్శించగా, వాటిలో మూడింటికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, మరో ఆవిష్కరణకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ నాలుగు బహుమతులు అమ్మాయిలు రూపొందించినవే కావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఆవిష్కరణలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు టీఎస్ఐసీ ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 11,283 మందికి ఆవిష్కరణలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించగా, అందులో 540 మంది ఫ్యాకల్టీలకు డిజైన్ థింకింగ్పై శిక్షణనిచ్చారు. యూనిసెఫ్ ఇండియా, ఇంక్విలాబ్ ఫౌండేషన్, వై హబ్, యువాన్ల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 490 కళాశాలల నుంచి రకరకాల ఐడియాలతో ముందుకు వచ్చారు. వారిలో ఉత్తమమైన వాటిని 10 ఆలోచనలను ఎంపిక చేసి, వాటిని బుధవారం టీ హబ్లో ప్రదర్శించారు.
మా జిల్లా ఆవిష్కరణలకు రూ. 5వేల అదనపు బహుమతి
రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి ఆవిష్కరణలు రావడానికి కారణం మంత్రి కేటీఆర్. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ హబ్ను ఏర్పాటు చేస్తే, ఆవిష్కరణలకు టీఎస్ఐసీని ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగిన యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ కార్యక్రమంలో రెండు ఆవిష్కరణలు వరంగల్ జిల్లాకు చెందినవే ఉన్నాయి. ఇది ఎంతో గర్వ కారణం. వీరికి నా వంతు రూ.5వేల చొప్పున నగదును బహుమతిగా అందజేస్తాను.
– వినయ్ భాస్కర్, ప్రభుత్వ విప్
రైతన్న కిట్..ధాన్యం సురక్షితం
రైతులు ఎంతో శ్రమ కోర్చి పండించిన పంటను మార్కెట్ వరకు తరలించేందుకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యను గుర్తించిన వరంగల్లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినిల బృందం జి.చందన, ఎన్.శ్వేతారెడ్డి, వి.లహరిక రైతన్న కిట్ పేరుతో చక్కని ఆవిష్కరణ చేశారు. టార్ఫాలిన్తో రూపొందించిన ఈ కవర్లో ఎకరం పొలంలో పండిన పంటను వర్షాకాలంలో ధ్యానం పాడవకుండా ఉండేలా రైతన్న కిట్ను రూపొందించారు. ఇందులో ఉండే టార్ఫాలిన్ కవర్ను నేలపై పరిచి, తడవకుండా ఉండేందుకు మూసివేసేందుకు జిప్తో కూడిన ఏర్పాటు చేశారు.
ధాన్యానికి గాలి తగిలేలా టార్పాలిన్ కవర్కు జాలితో కూడిన ఏర్పాట్లు చేశారు. ఈ విద్యార్థినుల బృందానికి మార్గదర్శకుడిగా రాజు వ్యవహరించారు. ఒకసారి కొనుగోలు చేస్తే 4-5 ఏళ్ల పాటు మన్నిక ఉండేలా దీన్ని హెచ్డీపీఈ టార్ఫాలిన్ను 250 జీఎస్ఎంతో రూపొందిచిన ఈ కిట్తో 25-30 క్వింటాళ్ల ధాన్యాన్ని ఎండబెట్టుకునే అవకాశం ఉంది. వీరికి మొదటి బహుమతి కింద రూ.1.50 లక్షలను చెక్కు రూపంలో అందజేశారు.
బొగ్గు గని కార్మికుల రక్షణకు బైట్ సిస్టమ్స్
బొగ్గు గనుల్లో కార్మికుల రక్షణ అనేది పెద్ద సమస్యగా ఉందని, దాని కోసం బీవీఆర్ఐటీ హైదరాబాద్కు చెందిన గ్రాహ్య యలవతి, విజ్ఞారెడ్డి, బి.పల్లవి, లక్ష్మీ దీపిక బైట్ సిస్టమ్స్ పేరుతో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. భూగర్భంలో ఉండి పనిచేసే బొగ్గు కార్మికుల వద్ద సెల్ఫోన్లు పనిచేయవు. అలాంటి వారి కోసం శరీరంపై ప్రత్యేకంగా ధరించేలా కోటుకు ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చడం ద్వారా వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు బయట ఉన్న బేస్ స్టేషన్ ద్వారా పరిశీలించే అవకాశం ఉంది. వారి ఆరోగ్య పరిస్థితి సైతం గుర్తించేలా ఈసీఈ విద్యార్థినులు కలిసి బైట్ సిస్టమ్స్ను రూపొందించారు.
ప్రస్తుతం ఈ ఆవిష్కరణ పీవోసీ దశలో ఉందని దీనికి ఫ్యాకల్టీలుగా ఉన్న ప్రియాకాంత్, సాయికృష్ణ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన లోరవాన్ టెక్నాలజీతో భూగర్భంలో ఉన్న బొగ్గు గనుల్లోని కార్మికుల కదలికలను, ఆరోగ్య పరిస్థితి ఈ పరికరం ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. రెండవ స్థానంలో నిలిచిన ఈ ఆవిష్కరణ నగదు బహుమతిగా రూ.1 లక్షను చెక్కు రూపంలో అందజేశారు.
సృజనాత్మకతతో మంచి భవిష్యత్
సృజనాత్మకత, సరికొత్త ఆవిష్కరణల ద్వారా మంచి భవిష్యత్ను నిర్మించుకునే అవకాశాలు ప్రస్తుతం విద్యార్థులకు ఉన్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు అలాంటి వారిని ప్రోత్సహించేందుకు రకరకాలుగా ముందుకు వస్తున్నాయి. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆవిష్కరణలపై విస్తృత్తంగా అవగాహన కల్పిస్తోంది. దాని ఫలితంగానే టీ హబ్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది.
– ఎస్.కె.జోషి, మాజీ సీఎస్, తెలంగాణ
చక్కని పరిష్కార మార్గాలున్నాయి
విద్యార్థి దశలోనే సమాజానికి మేలు చేసేలా యువతరం ఆలోచించాలి. అలాంటి వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సహకరిస్తే మంచి ఆవిష్కరణలు పుట్టుకువస్తాయి. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఎంతో క్లిష్టతరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలను చూపుతూ ఆవిష్కరణలు చేశారు.
– గ్యారిత్ విన్ ఓవెన్, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
ఇంట్లో పురుగుల నివారణకు క్రిమి హారిణి
ప్రతి ఇంట్లో రకరకాల సరుకులను నిల్వ ఉంచుకుంటాం. ఇందులో బియ్య, పప్పులు వంటి వాటిలో తరచూ పురుగులు వస్తుంటాయి. దీనికి చక్కని పరిష్కార మార్గాన్ని వరంగల్ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా కళాశాలకు చెందిన ఎస్.ఉమామహేశ్వరి, బి.స్టెల్లా, ఎం.శన్విత, ఎం.డి అఫ్రిన్ చూపించారు. క్రిమి హారిణి పేరుతో 6 రకాల సహజ సిద్ధంగా సేకరించిన పదార్థాలతో ఒక గుళికను సుమారు 200 గ్రాములతో తయారు చేశారు. దాన్ని బియ్యం, పప్పులు వంటి వాటిలో ఉంచితే పురుగులు రాకుండా అడ్డుకుంటుంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఇలాంటి మందులేదని, పేటెంట్ కోసం ఎదురుచూస్తున్నామని విద్యార్థినులు తెలిపారు. వీరికి అధ్యాపకులు దీప, వైజయంతి సహకారం అందించారు. దీనికి తృతీయ బహుమతి లభించగా, రూ.50వేలను చెక్కు రూపంలో అందజేశారు.