సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ అంశం చివరకు న్యాయస్థానానికి చేరింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్ సమావేశాన్ని బల్దియా కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుంది. వాస్తవానికి గత ఏడాది ఆగస్టు చివరి వారంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్లో నిర్వహించాల్సిన ఈ సమావేశం ఎన్నికల కోడ్తో జరగలేదు. ఈ క్రమంలోనే డిసెంబర్ 3న కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎన్నికల కోడ్ ముగిసింది. వెంటనే కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటుకు సిద్ధం చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ రోనాల్డ్రాస్ను ఆదేశించారు.
కానీ కమిషనర్ ఈ అంశాన్ని పక్కన పడేశారు. ఇదే సమయంలో బీజేపీ కార్పొరేటర్లు సైతం కమిషనర్ను కలిసి విన్నవించే ప్రయత్నం చేసినా.. వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చివరకు వారంతా విసిగిపోయి కమిషనర్ చాంబర్కు వినతిపత్రం అట్టించి నిరసన తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా..ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల విషయంలో, కౌన్సిల్ మీటింగ్ నిర్వహణపై కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చారు. కమిషనర్ వైఖరితో ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నిక లేకపోగా..తాజాగా కౌన్సిల్ సమావేశాల నిర్వహణలో నిబంధన ఉల్లంఘన జరుగుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ ఆమోదంలో ఈ సారి ఆలస్యమవుతున్నది.
ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం పెట్టాలంటూ.. మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశం పెట్టాలని అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నా.. ఫలితం శూన్యమని తెలిపారు. అన్ని విభాగాల్లో భారీ అవినీతి బట్టబయలు అవుతుందనే భయంతోనే కౌన్సిల్ సమావేశం నిర్వహించడం లేదని కార్పొరేటర్ శ్రవణ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో కోర్టుల ద్వారా చట్ట సభలు నడపాల్సి రావడం బాధాకరమని , ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని న్యాయవాది శివప్రకాశ్ అన్నారు. ప్రభుత్వం మీటింగ్ నిర్వహింసమస్యలపై చర్చ జరిగేలా చూడాలని కోరారు.
స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యత బల్దియాపైనే ఉంటుంది. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్దే. నూతన ప్రభుత్వం ఏర్పడడం వల్ల స్టాండింగ్ కమిటీకి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ నోటీసులో పెట్టి , స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాల్సిన చోట కాలయాపన చేస్తున్నారని కమిషనర్ తీరును కార్పొరేటర్లు ఎండగడుతున్నారు.
మరోవైపు జీహెచ్ఎంసీ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, స్టాండింగ్ కమిటీ సభ్యులు లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అపవాదు కూడా ఉన్నది. గత సంవత్సరం ఎన్నికలతో సర్వసభ్య సమావేశం జరగకపోగా..కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు దాటినా.. ఇప్పటి వరకు కౌన్సిల్ సమావేశం లేదని పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు మండిపడుతున్నారు. గ్రేటర్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా కమిషనర్ మాత్రం మేయర్ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు.