సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): త్వరలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2100కోట్ల నిర్దేశిత లక్ష్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పడి ఇప్పటి వరకు కేవలం రూ. 1428 కోట్ల మేర మాత్రమే వసూళ్లను రాబట్టుకున్నది. రూ. 672 కోట్ల కలెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ రాయితీ అందిస్తూ వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది.
బకాయి ఉన్న వారంతా తక్షణమే 10శాతం వడ్డీతో మాత్రమే బకాయిలు క్లియర్ చేసుకునే వెసులుబాటు దొరికింది. దీంతో ఈ నెలాఖరు 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో వచ్చే 24 రోజుల్లో సర్కిల్ల వారీగా లక్ష్యాలను ఖరారు చేస్తూ శుక్రవారం కమిషనర్ రొనాల్డ్రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా సర్కిల్కు ఒక సూపర్వైజరీ ఆఫీసర్లుగా నియమించారు. ఇందులో ఐఏఎస్ల నుంచి సీనియర్ అధికారుల వరకు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలపై అదనపు కమిషనర్ (ఫైనాన్స్) జయరాజ్ కెనెడీ పర్యవేక్షించనున్నారు.
ఇక ఐఏఎస్ల నుంచి ముఖ్య అధికారుల వరకు 31 సర్కిళ్లలో ఒక్కో సర్కిల్కు సూపర్వైజర్లకు బాధ్యతలను అప్పగించారు. వారు రోజూ వారీగా వసూలైన ఓటీఎస్ కలెక్షన్లను పీటీఐఎన్ నంబరు, వచ్చిన కలెక్షన్ల వివరాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు. ఆయా సర్కిల్ పరిధిలో టాప్ డిపాల్టర్స్ (బకాయిదారుల) లిస్ట్ను తీసుకొని వారికి నోటీసులు జారీ చేయడం, చెక్ బౌన్స్లపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ నెల 31వ తేదీలోగా ఓటీఎస్ వసూళ్లలో వేగం పెంచాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.