బొంరాస్పేట, ఫిబ్రవరి 14: కొత్త రేషన్ కార్డులు, గృహ వినియోగదారులకు ఫ్రీ కరెంటు సరఫరాను ఎప్పటి నుంచి అమలు చేస్తారని బుధవారం ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన నిర్వహించిన బొంరాస్పేట మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులను ప్రశ్నించారు. చాలా మందికి రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని రేషన్ కార్డులు ఇవ్వాలని తుంకిమెట్ల, చౌదర్పల్లి ఎంపీటీసీ సభ్యులు తిరుపతయ్య, నారాయణరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ సరఫరా ఎప్పటి నుంచి అమలు చేస్తారని సభ్యులు ప్రశ్నించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో 200 యూనిట్లలోపు కరెంటు వినియోగించే వారి వివరాలు సేకరిస్తున్నామని ట్రాన్స్కో అధికారులు తెలిపారు.
వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలని, మార్చి నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా రోజు విడిచి రోజు సరఫరా చేసే అవకాశం ఉన్నందున గ్రామాల్లో అందుబాటులో ఉన్న బోర్లను బాగు చేసుకోవాలని మిషన్ భగీరథ ఏఈ రాఘవేందర్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండలానికి ఉపాధిహామీ పథకంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 7.20 కోట్లు మంజూరయ్యాయని, మంజూరైన పనులను ఫిబ్రవరి 15వ తేదీలోగా ప్రారంభించాలని ఎంపీడీవో శ్రీదేవి ప్రత్యేకాధికారులకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో సాగు, తాగునీరు అందించడానికి సీఎం రేవంత్రెడ్డి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారని, దీనిద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 58 చెరువులను నింపుకునే అవకాశం కలుగుతుందని నీటిపారుదల శాఖ డీఈ కిరణ్కుమార్ అన్నారు.
మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత అధికారి తెలిపారు. సమావేశానికి ముందు ఇటీవల మృతిచెందిన ఎంపీవో పాండు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ షరీఫ్, అటెండర్ హేమలత, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ కుర్మయ్యల మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ శ్రావణ్గౌడ్, బొంరాస్పేట, దుద్యాల తహసీల్దార్లు రవికుమార్, దాన య్య, మండల పరిషత్ సూపరింటెండెంట్ వెంకన్గౌడ్, ఆయా శాఖల అధికారులు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.