ఇబ్రహీంపట్నం : నగరంలోని చైతన్యపురిలో గల గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను శుక్రవారం నుంచి అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కులో ప్రారంభించనున్నారు. ఇకనుంచి క్రయ విక్రయాలన్నీ ఇక్కడి నుంచే జరుగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ఉన్న పండ్ల మార్కెట్ 22ఎకరాల్లో మాత్రమే ఉండగా, ప్రస్తుతం బాటసింగారంలో 44ఎకరాల్లో పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్లో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారులకు, రైతులతో పాటు హామాలీలకు, డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతనంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్లో వసతులు కల్పించారు. పండ్ల మార్కెట్ను తరలించడాన్ని కొంతమంది వ్యాపారులు వ్యతిరేఖించినప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు బాటసింగారంలో ఏర్పాటు చేశారు. కాగా, గడ్డిఅన్నారం మార్కెట్ను అధికారులు ఇప్పటికే మూసివేశారు.
శుక్రవారం నుంచి వ్యాపారులు బాటసింగారం పండ్ల మార్కెట్లో క్రయ విక్రయాలు జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ. 90లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్లో రైతులకు వ్యాపారులకు కావల్సిన పూర్తి సదుపాయాలను కల్పించారు. మార్కెట్లో బ్యాంకు సౌకర్యంతో పాటు దవాఖాన, పోలీసు ఔట్పోస్టు, వ్యాపారులకు, రైతులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అలాగే, రాత్రి సమయంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పండ్ల లారీలన్నీ కూడా పార్కింగ్ చేసుకునేందుకు ప్లడ్లైట్లను కూడా ఏర్పాటు చేశారు. 8 ఎకరాల్లో బత్తాయి, బొప్పాయి, వాటర్మిలాన్ను విక్రయించుకునేందుకు గానూ 148మంది వ్యాపారులకు అతిపెద్ద స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, 50వేల ఎసెప్టీ సామర్థ్యంగల గోడౌన్లో యాక్సిస్ బ్యాంకు, ప్రైమరీ హెల్త్ సెంటర్, కార్యాలయ భవనం, రైతులు, వ్యాపారులు, హామాలీలు సేదతీరేందుకు వసతి వంటి సౌకర్యాలను కల్పించారు.
అలాగే, 22వేల ఎసెప్టీలో 42మంది కమీషన్ ఏజెంట్లకు వారు ఇతర దేశాలకు పండ్లను ఎగుమతి చేసుకునేందుకు గానూ వాటిని నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేశారు. కోల్డ్స్టోరేజీలో ఆపిల్, దానిమ్మ, సపోటా వంటి పండ్లను నిల్వ ఉంచుకునేందుకు వీలు కల్పించారు. అలాగే, మరో 50వేల ఎసెప్టీ గల గోడౌన్లో 129 మంది రైతులకు తాము పండ్లను క్రయ విక్రయాలు జరుపుకునేందుకు స్థలాలను కేటాయించారు. అలాగే, మరో ఎకరా స్థలంలో ఫైనాపిల్స్ వ్యాపారం జరుపుకునేందుకు వీలుగా 30మందికి ప్రత్యేకంగా నిర్మించిన షెడ్డును ఏర్పాటు చేశారు. మొత్తం 341మంది వ్యాపారుల కోసం స్థలాలను కేటాయించారు. ఈ వ్యాపారులంతా వచ్చి తమ వ్యాపారులను సవ్యంగా జరుపుకునేందుకు పూర్తి భరోసాను అధికారులు కల్పించారు.
తీరనున్న రవాణా సమస్య..
ప్రస్తుతం ఉన్న గడ్డిఅన్నారం మార్కెట్లోకి రాత్రి సమయంలో మాత్రమే వాహనాలకు అనుమతి ఉండేది. ఉదయం 8గంటల తరువాత వచ్చిన వాహనాలన్ని రాత్రి 10గంటల వరకు నగరం బయటనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కాని, నూతనంగా ఏర్పాటు చేస్తున్న బాటసింగారం పండ్ల మార్కెట్ నగర శివారులో ఉండటం వలన ఈ ప్రాంతంలో ఎలాంటి రవాణ ఆంక్షలు ఉండవు. అలాగే, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పండ్లను తీసుకువచ్చే వాహనాలు ఎప్పుడైనా ఔటర్రింగ్ రోడ్డు ద్వారా మార్కెట్లోకి రావడానికి అవకాశం ఏర్పడింది. బెంగళూరు, ముంబాయి, విజయవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఔటర్రింగ్రోడ్డు మీదుగా పెద్దఅంబర్పేట్ ఎగ్జిట్ వద్ద దిగి పండ్ల మార్కెట్కు చేరుకునే అవకాశముంటుంది.