బొంరాస్పేట, జనవరి 12 : పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కొవిడ్ వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించింది. బుధవారం నుంచే ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ బియ్యం పంపిణీలో ఉపయోగిస్తున్న సాంకేతికతను ఆధునీకరించడంలో కొంత జాప్యం జరిగిన కారణంగా ఈ నెల బియ్యం పంపిణీలో ఆలస్యం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పేదలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం సత్వరమే బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించింది.
2021 నుంచి నిరంతరంగా..
కరోనా కాలంలో పేదలు పనిలేక తిండికి ఇబ్బందులు పడరాదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 మే నుంచి నిరాటంకంగా పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది. రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నది. అదే నిర్ణయాన్ని ఈ ఏడాది చివరి వరకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత బియ్యం పంపిణీపై కొన్ని పార్టీలు లబ్ధిదారులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినా దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. గతంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద పంపిణీ చేయాల్సిన బియ్యం విషయంలో కేంద్రం ఆలస్యంగా నిర్ణయం వెలువరించడంతో 2021 మే నుంచి 2022 డిసెంబర్ వరకు 20 నెలలకుగాను ఒక్కో వ్యక్తికి 200 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 203 కిలోలు పంపిణీ చేశారు. 2021 మే, 2022 మే, జూన్ నెలల్లో రాష్ట్రం అదనంగా పంపిణీ చేసిన ఒక్కో కిలోను ఈ జనవరి నుంచి మార్చి వరకు సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జిల్లాలో 8.40 లక్షల మందికి ప్రయోజనం
ఈ ఏడాది వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వికారాబాద్ జిల్లాలోని 8.40 లక్షల మంది పేదలకు ప్రయోజనం కలుగనుంది. జిల్లాలో 588 చౌక ధరల దుకాణాలు ఉండగా.. వీటి పరిధిలో 2,41,000 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. వీటిలో 8.40 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా డిసెంబర్ వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను జిల్లాకు 4500 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే గ్రామాల్లోని చౌకధరల దుకాణాలకు బియ్యం చేరుకోవడంతో పంపిణీ కూడా ప్రారంభమైంది. బియ్యం పంపిణీ సాధారణంగా ప్రతి నెలా 15 వరకు పంపిణీ చేస్తారు. ఏదైనా జాప్యం జరిగితే ఈ గడువును పౌరసరఫరాల శాఖ పొడిగిస్తుంది. ఈ నెలలో బియ్యం పంపిణీ ఆలస్యం కావడంతో గడువు పొడిగించే అవకాశం ఉంది.
కేసీఆర్ మేలు చేస్తుండ్రు
– బ్యాగరి అనంతమ్మ, బురాన్పూర్, బొంరాస్పేట
సీఎం కేసీఆర్ పేదలకు ఎంతో మేలు చేస్తుండ్రు. చాలా నెలల నుంచి రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుండ్రు. దీనిని మరో ఏడాది కూడా ఇవ్వాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించడం సంతోషం. దీనివల్ల మాలాంటి పేదలకు మేలు కలుగుతుంది.
బుధవారం నుంచి ప్రారంభమైంది
– రాజేశ్వర్రావు, డీఎస్వో, వికారాబాద్
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీని బుధవారం నుంచి ప్రారంభించాం. జనవరి నుంచి మార్చి వరకు ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఆరు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తాం. దీనివల్ల జిల్లాలోని 8.40 లక్షల మంది పేదలకు ప్రయోజనం కలుగుతుంది. బియ్యం పంపిణీ ఆలస్యమైంది కాబట్టి గడువును పెంచే అవకాశం ఉంది.