కొత్తూరు : కొత్తూరు నుంచి షాద్నగర్ మీదుగా సోలీపూర్ రోడ్డు వరకు 4లైన్ల రోడ్డు నిర్మిస్తున్నారు. దీంతో కొత్తూరు, నందిగామ, షాద్నగర్ పట్టణాలకు మహర్దశ కలగనుంది. మూడేండ్ల క్రితం మంత్రి కేటీఆర్ షాద్నగర్ పర్యటన సందర్భంగా కొత్తూరు-షాద్నగర్ పాత జాతీయ రహదారిని 4 లైన్లుగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గతనెలలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లింగారెడ్డిగూడ వద్ద పనులు ప్రారంభించారు. అయితే హైవే 44విస్తరణలో భాగంగా కొత్తూరు-అన్నారం బైపాస్ రోడ్డు వేశారు. దీంతో కొత్తూరు-షాద్నగర్ పాత జాతీయ రహదారి గుంతలమయంగా మారి షాద్నగర్ రావడానికే ప్రజలు బయపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంత్రి కేటీఆర్ విజ్ఞాప్తి చేశారు. దీంతో మంత్రి రోడ్లు విస్తరణకు పచ్చ జెండా ఊపారు. అయితే టెండర్ పిలవడానికి రోడ్ల వెంబడి ఉన్న చెట్లు, అటవీ శాఖ అనుమతులు తదితర సమస్యల వల్ల రోడ్డు పనులకు కొంత ఆలస్యం జరిగింది.
రూ. 67కోట్లతో 17కి.మీ రోడ్డు
కొత్తూరు వై జంక్షన్ నుంచి సోలీపూర్ రోడ్డు వరకు 17 కి.మీ 4లైన్ల రోడ్డుకు రూ. 67కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ 17కి.మీ నాలుగు లైన్ల రోడ్డుతో పాటు బట్టర్ప్లై లైట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం ఈ రోడ్డు 150 ఫీట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు మధ్య నుంచి రెండు వైపులా 75ఫీట్ల రోడ్డుకు ఆర్అండ్బీ అధికారులు కొలతలు తీసుకుంటున్నారు. అయితే ఇందులో 50ఫీట్ల రోడ్డు నిర్మించనున్నారు. మిగతా రెండు వైపులా కలిసి 100ఫీట్లను భవిష్యత్ అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. 100 ఫీట్లలో డ్రైన్స్, ఎలక్ర్టికల్ స్తంభాలు, మిషన్ భగరీథ వాటర్ పైపులైన్ తదితర అవసరాల కోసం ఈ స్థలాన్ని వాడునున్నారు. 17 కిలోమీటర్ల రోడ్డులో మొత్తం 5 బ్రిడ్జిలు, 12 కల్వర్టులు, 8స్లాబ్ కల్వర్టులు నిర్మించనున్నారు.
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక శ్రద్ధ
అయితే ఈ పాత జాతీయ రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. షాద్నగర్ నియోజకర్గం భవిష్యత్ అవసరాలు తీరాలంటే ఈ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని ఎమ్మెల్యే సంకల్పించారు. అందుకోసం మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేసి రోడ్డును సాధించుకున్నారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ సమస్యలను అధిగమించి గత నెలలో ఈ రోడ్డు పనులకు శంకుస్థానప చేశారు. ఇక రోడ్డుకిరువైపులా ఉన్న చెట్ల తొలగించడానికి అటవీ శాఖ అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్య లేకుండా పనులు వెగవంతంగా జరిగేలా కృషి చేశారు.
కొత్తూరు, నందిగామ, షాద్నగర్ పట్టణాలకు మహర్ధశ
ముఖ్యంగా ఈ పాత జాతీయ రహదరి ఇరుగ్గా ఉంటడం, గుంతల మయంగా మారడంతో హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వెళ్లే ఆర్టీసీ బస్సులు షాద్నగర్కు రావడం లేదు. దీంతో ప్రయాణీకులు షాద్నగర్ డిపో బస్సుల పైనే ఆధారపడుతున్నారు. అలాగే జడ్చర్ల నుంచి షాద్నగర్ రావాలంటే ఇక గంటల కొద్ది నిరీక్షించాల్సిందే. నాలుగు లైన్ల రోడ్డు ఏర్పడితే ఆ సమస్య తీరనుంది. అంతేకాకుండా కొత్తూరు, షాద్నగర్ పట్టణాల్లో రోడ్డు విశాలంగా మారడం వల్ల పార్కింగ్ సమస్యలు తీరనున్నాయి. దీంతో పాటు పాత హైవే చుట్టు పక్కన ఉన్న భూముల విలువ పెరిగి రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకోనుంది.