ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10 : కృష్ణా జలాల సాధన కోసం ఈనెల 13న నల్గొండలో జరుగనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఢిల్లీ పాలకులకు తాకట్టు పెడుతున్నదని ఆరోపించారు.
దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పిదమన్నారు. గత పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించలేదన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసిందన్నారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గ రాములు, రమేశ్గౌడ్, రమేశ్, కిషన్గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు జంగయ్య, దామోదర్, వేణుగోపాల్రావు, పాల్గొన్నారు.