పరిగి, ఏప్రిల్ 22 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు సీఎం రేవంత్రెడ్డికి రైతులు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమాన్ని సోమవారం మహేశ్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
ప్రధానంగా రైతులకు సంబంధించిన రూ.2లక్షల పంట రుణ మాఫీ, ప్రతి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్, రైతుభరోసా కింద ఎకరాకు సంవత్సరానికి రూ.15వేల పెట్టుబడి సాయం, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు అందిస్తున్న పింఛన్ రూ.2వేల నుంచి రూ.4వేలకు పెంపు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు చేయూత వంటి పథకాలను అమలు చేయలేదన్నారు. ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ ద్వారా కాలయాపన చేసి ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని నానుస్తున్నదన్నారు.
లోక్సభ ఎన్నికల్లో మరోసారి లబ్ధి పొందేందుకు రూ.2లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తేదీ వరకు అమలు చేస్తామంటూ అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు జరిగేంత వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని, కేసీఆర్ పాలనలోనే తమకు న్యాయం జరిగిందని తెలుపుతున్నారన్నారు. ప్రతి గ్రామం నుంచి పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభిస్తామన్నారు.
కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, ఎస్ భాస్కర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్ ఆంజనేయులు, సీనియర్ నాయకులు బీ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎంపీటీసీ కే వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ మాణిక్యం, నాయకులు పీరంపల్లి రాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోశ్, నాయకులు బీ రవికుమార్, చుక్కయ్య, ఆసిఫ్, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.