పరిగి, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలపాలవుతున్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం పరిగి మండలం బసిరెడ్డిపల్లి, మాదారం గ్రామాల్లో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను దూరం చేసుకోవడం వల్లే ఈ కష్టాలు వచ్చాయని ప్రజలు భావిస్తున్నారన్నారు.
కేసీఆర్ హయాంలో ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఎకరాకు రూ.15 వేలు ఇంకా ఎందుకివ్వలేదన్నారు. రూ.2లక్షలు రుణమాఫీ, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పింఛన్ల పెంపు, ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే భార్యాభర్తలకు పింఛన్, ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.2500 వంటి హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా ఏ ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొత్త నాటకానికి కాంగ్రెస్ తెర తీసిందని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో కరెంటు, తాగునీటి కష్టాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నారు. మరోసారి కాంగ్రెస్ను నమ్మితే మరిన్ని కష్టాలు కొని తెచ్చుకోవడమేనని.. ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకుడు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, మాజీ సర్పంచ్లు రాములు, మధుసూదన్రెడ్డి, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
బషీరాబాద్ : తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలంలోని నీళ్లపల్లి, మైల్వార్, దామర్చేడ్, బషీరాబాద్, జీవన్గి గ్రామాల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పథకాలు అందని ఇల్లూ లేదన్నారు. కాంగ్రెస్ పచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, వచ్చీరాగానే కరెంట్ కష్టాలు మొదలయ్యాయన్నారు.
కనీసం సరిపడా తాగునీరిచ్చే సోయి కూడా లేదని మండిపడ్డారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను బోల్తా కొట్టించిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందన్నారు. మోసపూరిత హామీలకు మరోసారి మోసపోకుండా బీఆర్ఎస్కు ఓటేసి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రచారానికి ఆరు గ్యారెంటీలపై నిలదీయాలన్నారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రజలను దగ్గరకు రానివ్వడని, తాండూరులో కనీసం పదిమందిని కూడా ఆయన గుర్తుపట్టరని తెలిపారు.
తాండూరుకు రమ్మని పిలిచినా రాని రంజిత్రెడ్డి ఎన్నికలు రావడంతో కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్కుమార్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజుగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు అశోక్గౌతమ్, రుక్మారెడ్డి, అనంతయ్య, రాజురెడ్డి, పాండురంగారెడ్డి, ముకుంద్, గోపాల్రెడ్డి, హన్మంత్రెడ్డి, నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.