ఆమనగల్లు, ఫిబ్రవరి 10 : కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని తన నివాసంలో చలో నల్గొండ సభ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కృష్ణా జలాల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ పట్టుదలగా ఉన్నదని, చలో నల్గొండ సభకు అధినేత కేసీఆర్ హాజరై కృష్ణా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎండగట్టనున్నారన్నారు. సమావేశంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి , మాజీ ఎంపీపీ రాంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్గౌడ్, లాలయ్యగౌడ్, ఈశ్వరయ్య, భాస్కర్రావు, శంకర్, పరమేశ్, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.