రంగారెడ్డి, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనలేక మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల ద్వారా ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తూ అక్రమ కేసులను బనాయిస్తున్నదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలపై ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై ప్రగాఢ నమ్మకం ఉన్నదని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదేండ్లు పాలించిన బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదన్నారు.
నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని మాయమాటలు చెప్పారని ఎద్దేవా చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ఆ లెక్కన 20కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. కొత్త ఉద్యోగాల ఊసేలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను సైతం తీసేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గొంతులో ప్రాణమున్నంత వరకు మోటర్లకు మీటర్లు పెట్టనివ్వనని కేసీఆర్ అన్నందుకు, నల్ల చట్టాలను వ్యతిరేకించినందుకు కక్ష పెంచుకుని కేంద్రం రాష్ర్టానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లోనే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయి విమర్శలను ఎదుర్కొంటున్నదని విమర్శించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలుపించుకుని బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఒక్క తాటిపైకి వచ్చి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్సీలు సురభివాణీదేవి, దయానంద్ గుప్తా, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, యువ నేత కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.