షాబాద్, మార్చి 1 : పరిశ్రమల ఏర్పాటుతో షాబాద్కు కొత్తరూపు వచ్చిందని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని గొల్లూరుగూడ గ్రామంలో పట్నం రాజేందర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద, విగ్రహాలకు చేవెళ్ల, కొడంగల్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్రెడ్డి, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారం రోజులుగా రాజేందర్రెడ్డి స్మారకార్థం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
క్రికెట్లో మొదటి బహుమతి మన్సుర్ నాగరగూడ జట్టుకు రూ.లక్ష నగదుతో పాటు జ్ఞాపిక, ద్వితీయ బహుమతి షాబాద్ జట్టుకు రూ.75వేల నగదుతో పాటు జ్ఞాపికను, వాలీబాల్లో మొదటి బహుమతి కంకల్ జట్టుకు రూ.25వేలు నగదుతో పాటు జ్ఞాపిక, ద్వితీయ బహుమతి రూ.15వేల నగదుతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాజేందర్రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు యాదయ్య, నరేందర్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్తో మాట్లాడి చందనవెళ్లిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసిన్నట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నట్లు స్పష్టం చేశారు. చందనవెళ్లి కంపెనీలో తయారైన వస్తువులు ప్రపంచ దేశాలకు సరఫరా చేయడం సంతోషకరమన్నారు. సీతారాంపూర్లో త్వరలో ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ ప్రారంభం కానున్నట్లు, ఇప్పటికే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. గొల్లూరుగూడ నుంచి తమ(పట్నం)కుటుంబానికి రాజకీయ జీవితాన్ని అందించిన షాబాద్ మండల ప్రజలను ఎప్పటికీ మరిచిపోమని, నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 30ఏండ్ల క్రితం రూ.50లక్షలతో షాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటు చేశామని, త్వరలో ఈ స్టేడియంలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. రాజేందర్రెడ్డికి క్రీడలంటే ఎంతో ఇష్టముండేదని తెలిపారు. పేద వారికి ఆపద సమయంలో అండగా నిలిచేవారన్నారు.
త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మాట్లాడుతూ క్రీడాపోటీలతో గ్రామాల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పాడుతాయని తెలిపారు. దివంగత రాజేందర్రెడ్డి పేరున ప్రతి ఏడాది జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్రావు, మాజీ చైర్మన్లు వెంకటయ్య, నక్క శ్రీనివాస్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, మాజీ జడ్పీటీసీలు కోట్ల మహేందర్రెడ్డి, జడల రాజేందర్గౌడ్, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, పార్టీ మండల కార్యదర్శి శ్రీరాంరెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, పీసరి సతీశ్రెడ్డి, రమేశ్యాదవ్, మహేశ్యాదవ్, దామోదర్రెడ్డి, ముఖ్రంఖాన్, మధుకర్రెడ్డి, దర్శన్, మల్లేశ్, చాంద్పాషా, రాజేందర్రెడ్డి, ఇమ్రాన్, భూపాల్రెడ్డి, ఆరీఫ్, రాందేవ్యాదవ్, మల్లారెడ్డి, కరుణాకర్, మల్లికార్జున్గౌడ్, హన్మంత్రెడ్డి, నందు, సుదర్శన్, సామ ప్రతాప్రెడ్డి, శ్రీశైలంగౌడ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్, మార్చి 1: రాజేందర్రెడ్డి వర్థంతిని పురస్కరించుకుని చేవెళ్ల మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం , డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణతో కలిసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, మాజీ మండల అధ్యక్షుడు రమేశ్వర్రెడ్డి, మర్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, జడ్పీటీసీ అవినాశ్రెడ్డి, నాయకులు, కృష్ణా రెడ్డి, మాణిక్యరెడ్డి అబ్దుల్గని ఉన్నారు.